కూతురు చూస్తుండగానే..: వివాహేతర సంబంధంతో ఘోరం జరిగిపోయింది..
Recommended Video
తూప్రాన్: వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యా-భర్తల హత్యలకూ దారితీస్తున్నాయి. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా మెదక్ జిల్లాలోనూ వివాహేతర సంబంధం ఇద్దరిని బలతీసుకుంది.
ఏమైంది?:
కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)కు మధ్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా నడిచిన ఈ వ్యవహారం ఇటీవలే బయటపడింది.
ఆమె భర్త దుబాయిలో..:
దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉన్నారు. కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లయినప్పటికీ.. కొన్నాళ్ల క్రితం విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే దేవేంద్రతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.
కులపెద్దల పంచాయితీ..:
దేవేంద్ర-కాశీరాంలు కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసి పెద్ద గొడవకు దారితీసింది. చివరకు కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా.. కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు.
మనస్తాపంతో ఆత్మహత్య..:
దేవేంద్ర వివాహేతర సంబంధం గురించి దుబాయ్ లో ఉన్న భర్తకు తెలియడంతో.. ఇక ఆమెతో కాపురం చేసేది లేదని అతను తెగేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కుమార్తె చూస్తుండగానే..:
కుమార్తెను కూడా తనతో పాటు తీసుకుపోయినప్పటికీ.. ఆ చిన్నారిని రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ పై వదిలిపెట్టి దేవేంద్ర కాశీరాంతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియని ఆ చిన్నారి ఫ్లాట్ ఫామ్పై అమాయకంగా తల్లి కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం పలువురిని కలచివేసింది.