అక్రమ సంబంధం.. ఆపై అనుమానంతో దారుణ హత్య..
ముందే అనుమానం మనిషి, ఫోన్ కాల్ పట్ల కూడా అనుమానం వ్యక్తం చేస్తూ.. వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు.
సిద్దిపేట: తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ వేరే వ్యక్తులతో చనువుగా మాట్లాడుతుందన్న అక్కసు.. ఎక్కడ తనకు కాకుండా పోతుందోనన్న అనుమానంతో ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా నంగునూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల లావణ్య(28)కు అదే గ్రామానికి చెందిన పర్శరాములు అనే వ్యక్తికి మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. లావణ్య భర్త ఖతర్ లో కూలీగా పనిచేస్తుండటంతో.. ఆమెకు దగ్గరైన పర్శరాములు కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు.
అయితే ఇటీవల లావణ్య తనను నిర్లక్ష్యం చేస్తుందన్న అభద్రతా పర్శరాములులో ఎక్కువైంది. దానికి తోడు ఇతరులతో చనువుగా మాట్లాడినా పర్శరాములు తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న లావణ్యకు ఫోన్ చేసిన పర్శరాములు.. ఎప్పుడూ కలుసుకునే చోటుకు రావాలని చెప్పాడు. అతని మాటలు నమ్మి అక్కడికెళ్లిన లావణ్య.. పర్శరాములు దురాఘతానికి బలైపోయింది.
అనుకున్న ప్రదేశంలో ఇద్దరు కలుసుకున్న తర్వాత లావణ్య సెల్ ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. ముందే అనుమానం మనిషి, ఫోన్ కాల్ పట్ల కూడా అనుమానం వ్యక్తం చేస్తూ.. వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం మొక్కజొన్న తోటలోకి లాక్కెళ్లి ఓ చీరలో మూటగట్టి గ్రామశివారులోని ఓ చెరువు వద్ద ఉన్న గుంతలో ఆమె శవాన్ని పడేశాడు.
అమె చనిపోయినట్ల నిర్దారించుకున్న తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసు, కాళ్ల కడియాలు తీసుకుని అక్కడినుంచి పరారయ్యాడు. గురువారం నాడు పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో దొమ్మాట వైపు వెళ్తున్న పర్శరాములును పోలీసులు విచారంచడంతో నిజం అంగకీరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.