వీడిన మిస్టరీ: అతనితో సంబంధమే కారణం.. టీడీపీ మహిళా నేత హత్య వెనుక!
భూపాలపల్లి: జిల్లాలోని కాటారం మండలం కొత్తపల్లిలో చోటు చేసుకున్న తెలుగుదేశం మహిళా నాయకురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి చేరుకున్న కవిత.. అర్థరాత్రి సమయంలో హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తాజాగా నిర్దారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ మహిళా నాయకురాలు రామిల్ల కవిత చాలా క్రితం భర్తతో విడిపోయారు. అప్పటినుంచి ఇద్దరు కుమార్తెలతో కొత్తపల్లిలోని ఇంట్లో నివసిస్తున్నారు. ఇదే క్రమంలో దూరపు బంధువైన ములుగు సర్పంచి గుగ్గిళ్ల సాగర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో సాగర్ భార్య సుజాత పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కవిత-సాగర్ లకు కౌన్సెలింగ్ నిర్వహించినా.. పెద్దగా మార్పు లేదు. భర్త మారకపోవడంతో.. సుజాత పలుమార్లు ఆత్మహత్యకు కూడా యత్నించారు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. అయినా లాభం లేకపోయింది.
ఈ నేపథ్యంలో తమ ఇంట్లో అద్దెకు దిగిన భూపాలపల్లి మండలం పెద్దాపురానికి చెందిన పసరగొండ రజినీకాంత్కు తన గోడు వెల్లబోసుకుంది సుజాత. దీంతో కవితనే హత్య చేయడమే దీనికి పరిష్కారమని రజనీకాంత్ ఆమెకు సలహా ఇచ్చాడు. ఆపై కవితను హతమార్చేందుకు సుజాత రూ.5లక్షలతో అతనితో ఒప్పందం కుదుర్చుకుంది.
నేరచరిత్ర కలిగిన పెద్దాపురానికి చెందిన కన్నూరి కుమారస్వామి హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. హత్య కోసం కుమారస్వామి, రజినీకాంత్, కుక్కమూడి అశోక్, నూనగంటి చిరంజీవి అలియాస్ అభిలాష్లతో కలిసి కవిత ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించారు. ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత కుమారస్వామికి తెలియకుండానే కవితను హత్య చేశారు.
ఈ నెల 11న అర్థరాత్రి వేళ.. వెనక కిటికీలో నుంచి కవిత ఇంట్లోకి చొరబడి కత్తులతో ఆమెపై దాడి చేశారు. కవిత కుమార్తెను ఓ గదిలో బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులు గుగ్గిళ్ల సుజాత, రజినీకాంత్, అశోక్, కుమారస్వామి, జగదీశ్, మోహన్, చంద్రయ్యలను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.