ధూల్పేట ఎక్సైజ్ పీఎస్పై గుడుంబా వ్యాపారుల దాడి: సీఐపై చేయి చేసుకున్నారు!
హైదరాబాద్: నగరంలో కొందరు గుడుంబా, గంజాయి వ్యాపారులు రెచ్చిపోయారు. ధూల్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్పై గురువారం దాడికి పాల్పడ్డారు. మంగళహాట్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు బుధవారం ఓ తల్లీకొడుకును అదుపులోకి తీసుకున్నారు.
అధికారులపై చేయి చేసుకున్నారు..?
కాగా, అదుపులోకి తీసుకున్న వారిద్దరినీ విడిపించి తీసుకెళ్లేందుకు వారి కుటుంబసభ్యులు, బంధువులు ధూల్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్పై గురువారం మధ్యాహ్నం దాడికి పాల్పడ్డారు. అంతేగాక, విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, సీఐపై వారు చేయి చేసుకున్నట్లు తెలిసింది.
గంజాయి విక్రయిస్తుండగా..
ఆర్తి బాయి, ఆమె కొడుకు ఉద్దేశ్ సింగ్ గంజాయి విక్రయం కేసులో గతంలోనూ అరెస్టై జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ వారిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గంజాయి విక్రయాన్నే వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం వీరు గంజాయి విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.
నిందితులకు మద్దతుగా..
వీరిద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్ కు తరలించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నిందితులకు చెందిన సుమారు 15మంది పోలీస్ స్టేషన్కు వచ్చారు. కేసులు నమోదు చేయకుండా వారిని వదిలేయాలని డిమాండ్ చేశారు.
నిందితుల్ని తీసుకెళ్లిపోయారు?
అయితే, గతంలో అరెస్టైనా ఏమాత్రం వారిలో మార్పు రాలేదని, రిమాండ్కు తరలించి తీరుతామని అధికారులు తేల్చి చెప్పడంతో ఇరువురు మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితులిద్దరినీ విడిపించుకొని తీసుకెళ్లిపోయారని తెలిసింది. ఈ క్రమంలో మంగళహాట్ పోలీసులకు ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.