అకాల వర్షాలకు కారణమిదే.. తెలంగాణలో ఈసారి చలి తక్కువేనన్న ఐఎండీ
ప్రస్తుత శీతాకాలంలో తెలంగాణలో వాతావరణం అసాధారణంగా ఉందని, ఉత్తరాదిలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం వేడి వాతావరణం, అకాల వర్షాలు కురుస్తుండటమే ఇందుకు నిదర్శనమని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం 'విండ్ డిస్ కంటిన్యూటి జోన్'లోకి వెళ్లడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్ సాధారణ స్థాయికంటే 2 నుంచి 6 డిగ్రీలు మాత్రమే తగ్గిందని, ఈ సీజన్ లో ఉండాల్సినదానికంటే వేడి ఎక్కువగా ఉండటం వల్లే అకాల వర్షాలు కురుస్తున్నాయని ఆమె చెప్పారు.
చలి ప్రభావం తక్కువే..
గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది చలికాలం వెచ్చగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం(జనవరి1 న) నిజామాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 20.9 డిగ్రీల సెల్సియస్ నమోదైందని, ఇది సాధారణం కంటే 7.2 డిగ్రీలు తక్కువని డాక్టర్ నాగరత్నం తెలిపారు. సాధారణంగా ప్రతి డిసెంబర్ లో 2 నుంచి 4 రోజులపాటు రాష్ట్రమంతటా బలమైన చలిగాలులు వీస్తాయని, అదే 2019 డిసెంబర్ లో మాత్రం ఒకే ఒక్క రోజు.. అది కూడా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే చలిగాలులు వీచాయని గుర్తుచేశారు. 2019 డిసెంబర్లో అతి తక్కువగా ఆదిలాబాద్లో 6.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని, హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీల సెల్సియస్ గా రికార్డైందని వెల్లడించారు.
దీనికి కారణం ఏంటంటే..
ప్రస్తుతం తెలంగాణ.. ‘విండ్ డిస్ కంటిన్యూటి జోన్'గా మారిందని, అందువల్లే అనుకోని మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారిణి తెలిపారు. గడిచిన పదేళ్ల రికార్డుల్ని తిరగేస్తే.. 2017లో ఆదిలాబాద్లో అత్యల్పంగా 3.5 డిగ్రీల సెల్సియస్, 2010లో హైదరాబాద్ లో అతి తక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని గుర్తుచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇక్కడి వేడి వాతావరణాన్ని సూచిస్తున్నాయని, అయితే, ఈ నెల 5 తర్వాత చలికాలం ప్రభావం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు డాక్టర్ నాగరత్నం చెప్పారు.
వర్ష సూచన..
సౌత్ ఈస్ట్ రీజియన్ నుంచి గాలుల ప్రభావం ఎక్కువగా కొనసాగుతుండటంతో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించలేకపోతున్నాయని, సముద్రం నుంచి వేడి గాలులు వీయడం వల్లే వర్షాలు కురుస్తున్నాయని, ఇది కొంత కలవరపాటుకు గురిచేసే అంశమే అయినా.. చలికాలంలో వర్షాలు కామనే అని ఐఎండీ డైరెక్టర్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో 28.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని, శుక్ర, శనివారాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని డాక్టర్ నాగరత్నం తెలిపారు.