రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత అవసరమా?: గాంధీభవన్లో సీనియర్ల వాగ్వాదం, ఆజాద్ ఎదుటే!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం గాంధీభవన్లో సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఎదుటే ఇద్దరు పార్టీ సీనియర్ నేతలు వాగ్వాదం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత అవసరమా?
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు గులాంనబీ ఆజాద్ పార్టీ నేతలతో గాంధీభవన్లో సమావేశమయ్యారు. కాగా, మీడియాతో మాట్లాడిన అనంతరం ఆజాద్ వద్దకు సీనియర్ నేత వీ హనుమంతరావు వెళ్లారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకని ప్రశ్నించారు.
షబ్బీర్ సహకారం అంటూ వీహెచ్ ఆవేదన..
అంతేగాక, ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీ సహకరిస్తున్నారంటూ వీహెచ్.. ఆజాద్కు ఫిర్యాదు చేశారు. పార్టీలో ముందు నుంచి ఉన్న అసలైన సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీ హనుమంతరావు.
షబ్బీర్ అలీతో వాగ్వాదం.. వీహెచ్ ఔట్..
ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారంటూ వీహెచ్ ఆజాద్కు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన షబ్బీర్ అలీ జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చోటు చేసుకుంది. వీహెచ్, షబ్బీర్ అలీ కాసేపే వాగ్యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత వీ హనుమంతరావు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
రేవంత్ రెడ్డిపై సీనియర్ల అసహనం..
కాగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి సీనియర్ నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది సమయంలోనే ఆయనను రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పార్టీలో రేవంత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దీంతో సీనియర్ నేతలు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ వాపోతున్నారు.