కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. 60 రోజుల్లో ఏం చేయబోతున్నారు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పంద్రాగస్టు ప్రసంగంలో కొత్తదనం కనిపించింది. ఎప్పటిలా చేసిన, చేస్తోన్న పథకాలను చెప్పడంతో పాటు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అదేనండి టార్గెట్ 60.. ఆరవై రోజుల్లో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన ప్రసంగంలో కీలకంగా వివరించారు. కేసీఆర్ సర్కార్ 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తుంది. అంతేకాదు ప్రణాళిక అమలుకు ముందే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులు వస్తాయని వివరించారు.
శుభ్రత .. పరిశుభ్రత ...
గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడైనా అపరిశుభ్ర కనిపిస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణం అవడంతో 60 రోజుల డ్రైవ్ చేపట్టారు. ఇందులో నేత, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు కేసీఆర్. వీరంతా సమిష్టి కృషితో గ్రామాల రూపురేఖలే మార్చాలని కోరారు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కుల పెరుగుతున్నాయని, కూలిపోయిన ఇళ్ల శిథిలాలు, పాడుపడ్డ పశువుల కొట్టాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. మురుగునీటి నిల్వతో దోమలు వస్తున్నాయని .. వీటని యుద్ధప్రాతిపదికన 60 రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు.
ఇక వెలుగులే ..
గ్రామాల్లో .. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల వంగిపోయిన కరెంట్ పోళ్లు, తుప్పుపట్టిన పాతస్తంభాలు ఉన్నాయని చెప్పారు. వాటికి కరెంట్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయని .. మూడో వైరు లైకపోవడంతో వీధి దీపాలు వెలగడం లేదన్నారు. 60 రోజుల ప్రణాళికలో భాగంగా వారం రోజులు విద్యుత్ శాఖ అధికారులు ప్రజలతో భాగస్వాములు కావాలని సూచించారు. పవర్ వీక్ నిర్వహించి .. మరమ్మతులు చేయాలని సూచించారు. వారం రోజుల్లో ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను పరిస్కరించుకోవాలని సూచించారు.
కోరిన మొక్కలు ..
వీటితోపాటు పల్లె, పట్టణాల్లో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయాలని కోరారు. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలను జిల్లా గ్రీన్ కమిటీ అందించే సూచనలు విధిగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు కోరుకునే ఆరు మొక్కలను వారికి ఇవ్వాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేశారు. పచ్చదనంతో మన బతుకు అని .. డబ్బులు పెట్టి వానలు, గాలిని కొనలేమన్నారు. మనకు ప్రశాంతత కుడా రాదన్నారు. రాబోయే తరానికి ఆస్తులు కాదు మంచి పర్యావరణాన్ని వారసత్వంగా ఇవ్వాలని సూచించారు.
ప్రగతి కేంద్రాలు ..
పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రక్రియలో పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల ఖాళీలను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని గుర్తుచేశారు. నూతన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. దీంతోపాటు త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ రూపొందించామని .. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు.