కాంగ్రెస్కు షాక్: హస్తానికి హ్యాండిచ్చి కారెక్కనున్న మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
హైదరాబాద్: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. 2018లో రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా హస్తానికి హ్యాండిచ్చి కారు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
గులాబీ గూటికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..?
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్కు అరకొర సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్తు ఉండదని భావించిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా కారు ఎక్కుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన శ్రీధర్ బాబు టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం.
గతంలోనే పార్టీ మారతారనే ప్రచారం
మంథని నియోజకవర్గం నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధుకర్ పై విజయం సాధించారు. ఈయనకు 89045 ఓట్లు పోలవగా పుట్టామధుకర్కు 72815 ఓట్లు వచ్చాయి. దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావును నక్సలైట్లు హత్యచేశారు. తండ్రి మరణంతో రాజకీయ అరంగేట్రం చేసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. రోశయ్య హయాంలో విప్గా కూడా పనిచేశారు. ఇక టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిన సమయంలోనే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో ఆయన పార్టీ మారలేదు.
కేటీఆర్తో ఇప్పటికే చేరికపై క్లారిటీ ఇచ్చిన శ్రీధర్ బాబు
కాంగ్రెస్లో ఇమడలేక తాను పార్టీ మారేందుకే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో కూడా చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. శ్రీధర్ బాబు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే వార్తలు రావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాత్రి నుంచి శ్రీధర్ బాబుతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఆయన పార్టీ మారడం లేదని బయటకు చెబుతున్నప్పటికీ శ్రీధర్ బాబు మాత్రం గులాబీ పంచన చేరేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన చేరిక కూడా బడ్జెట్ సమావేశాలలోపే ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నెల 7వ తేదీన అధికారికంగా గులాబీ కండువా కప్పుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం.
Recommended Video
అధికారుల నుంచి లేని సహకారం
దుద్దిళ్ల శ్రీధర్ బాబు పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంతేకాదు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తన నియోజకవర్గంలో అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడం కూడా ఆయన్ను ఆవేదనకు గురిచేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధికారులంతా పుట్టా మధుకే సపోర్ట్ చేస్తుండటంతో శ్రీధర్ బాబు ఒక్కింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించడంలో కీలకంగా వ్యవహరించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది