హుజూర్నగర్ ఉప ఎన్నిక: మొరాయిస్తున్న ఈవీఎంలు: 15 శాతం పోలింగ్ నమోదు..!
Recommended Video
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు.
తొలి మూడు గంటల్లో15 శాతం పోలింగ్..
హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక గతంలో ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి మూడు గంటల్లో దాదాపుగా 15 శాతం పోలింగ్ నమోదైనట్లుగా నియోజకవర్గం నుండి అందుతున్న ప్రాధమిక సమాచారం. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గతం కంటే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొరాయిస్తున్న ఈవీఎంలు..
నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. మరోవైపు చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ గుర్తులు గుర్తించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను.. పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు.
6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి. ఈ నెల 24న ఎన్నిల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటం..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ నుండి ఆయన సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది.
బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడి ఆర్టీసీ కార్మికుల ఓటింగ్ పైన పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే, పోలింగ్ జరగక ముందే ప్రధాన పార్టీలు విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి.