హుజూర్నగర్ బరిలో 251 మంది సర్పంచ్లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కొత్త ట్విస్ట్. సరిగ్గా నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న పరిణామాలే..ఇప్పుడు ఇక్కడా కనిపిస్తున్నాయి. అయితే అప్పుడు అక్కడ రైతులు..ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ లు. తమ మీద వివక్ష చూపుతోందంటూ హుజూర్నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.అదే సమయంలో అక్కడ కొందరు లాయర్లు సైతం బరిలో దిగాలని నిర్ణయించారు.
ఇక..గత ఎన్నికల్లో కలిసి పని చేసిన పార్టీలు తిరిగి కూటమిగా అభ్యర్ధిని నిలబెట్టాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం నియోకవర్గ పరిధిలోని ప్రతీ మండలానికి ముగ్గురు నేతలు చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఇక..ఇప్పుడు సర్పంచ్ లు..లాయర్ల నామినేషన్ల దాఖలు ఎవరి ఓట్లకు గండి కొడుతాయి..ఎవరిమి మేలు చేస్తాయనే చర్చ మొదలైంది.
నాడు నిజామాబాద్ తరహాలోనే..
సార్వత్రిక ఎన్నికల సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేసారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారు ఎన్నిక ల బరిలో దిగారు. ఏకంగా ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాశి స్థానం నుండి పోటీకి సమాయత్తమయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కనిపిస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఉప ఎన్నిక
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పట్ల వివక్ష చూపుతోందంటూ హుజూర్నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా సర్కారుకు తమ సత్తా చాటుతామని అంటున్నారు. నిజామాబాద్ లో రైతులు నామినేషన్లు దాఖుల చేసిన విధంగానే ఇప్పుడు వీరు కదం తొక్కుతున్నారు.
హలో సర్పంచ్.. చలో హుజూర్నగర్
హుజూర్నగర్ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా సర్కారుకు తమ సత్తా చాటుతామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో వీరంతా బరిలోకి దిగనున్నారు. హలో సర్పంచ్.. చలో హుజూర్నగర్ పేరుతో ఈ నెల 29, 30 తేదీల్లో తాము నామినేషన్లు దాఖలు చేయనున్నుట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్నయాదవ్ తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
విస్తృతంగా ప్రచారం
నామినేషన్లు వేయడమే కాకుండా.. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా తమ సమస్యల తీవ్రత ఏంటో ప్రభుత్వానికి తెలియచేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ట్రాక్టర్ గుర్తు కారణంగానే కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్న అధికార టీఆర్ యస్ పార్టీ ఇప్పుడు ఇంత మంది పోటీలో ఉంటే ఎవరికి నష్టమనే అంచనాలు మొదలయ్యాయి.
సీపీఎం మినహా వారంతా ఒకే అభ్యర్ధితో..
ఇక..సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ యస్.. బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి పేరుతో పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలోనూ కలిసి నడవాలని నిర్ణయించాయి. ప్రధాన పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్లే కాకుండా నియోజకవర్గంలో టీడీపీ, సీపీఎం, సీపీఐలకు కూడా కొంత పట్టు ఉంది. బీజేపీ, టీజేఎస్కు సంస్థాగతంగా పట్టు లేనప్పటికీ కశ్మీర్ అంశంతోపాటు ఇటీవల తెరపైకి వచ్చినట్లుగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామన్న సంకేతాలు కూడా ఆ పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కాంగ్రెస్కు మద్దతిచ్చే లైన్లోనే ఉండగా, గత ఎన్నికల్లో 2 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న సీపీఎం మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తంమీద ఈ పార్టీల వైఖరి, ఆయా పార్టీలకు వచ్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదు. దీంతో..ఒంటరిగా పోటీ చేయాలని భావించిన టీడీపీ నిర్ణయాన్ని మార్చుకుంది.
గత ఎన్నికల ఓటింగ్ సరళి ద్వారా..
2009లో తొలిసారి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 80,835 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 51,641 ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్కు 79,879 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దాదాపు 30 వేల ఓట్లు రాగా టీడీపీకి కూడా 25 వేల ఓట్లు పోలయ్యాయి.
ఉత్తమ్ గెలుపు
ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బరిలోకి దిగలేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కు 92,996 ఓట్లు రాగా, టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 7,400 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ గెలుపొందారు. అయితే..అప్పుడు ఎన్నికల గుర్తు కారణంగానే ఉత్తమ్ గెలిచారని కేటీఆర్ చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు అభ్యర్ధుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మండలానికి ముగ్గురు నేతలు..
పీసీపీ అధ్యక్షుడు సతీమణి కాంగ్రెస్ నుండి బరిలో ఉండటం..ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ యస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే కేటీఆర్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తుండగా..అభ్యర్ధి కి అండగా నిలుస్తూ..పార్టీ సమన్వయ బాధ్యతలను పల్లె రాజశేఖర రెడ్డికి అప్పగించారు. ఇప్పుడు నియోకవర్గ పరిధిలోని ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఇన్ ఛార్జ్ లను నియమిస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. వచ్చే నెల 21న పోలింగ్..24న కౌంటింగ్ జరగనుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్దులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.