ఒకే అమ్మాయిని ప్రేమించారు: పెట్రోల్ పోసుకుని ఇద్దరు యువకుల ఆత్మ‘హత్యా’?
జగిత్యాల: ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు పరస్పరం ఘర్షణ పడి క్షణికావేశంలో ఒకరిపై ఒకరు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ఇద్దరూ పదో తరగతి విద్యార్థులే..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్(16), విద్యానగర్కు చెందిన బంటు రవితేజ (16) స్నేహితులు. స్థానిక మిషనరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం పొద్దుపోయాక ఇద్దరూ పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వద్దకు వెళ్లారు.
గొడవ.. ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని..
కొద్ది సేపటికే పరస్పరం ఘర్షణ పడిన వాళ్లు.. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒకరిపై ఒకరు చల్లుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రాంతీయ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు.
ఇద్దరూ ప్రాణాలు వదిలారు..
ఈ లోపే మహేందర్ మృతి చెందగా..రవితేజ కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలంలో బీరు సీసాలు ఉండటాన్ని బట్టి..ఘర్షణ పడే ముందు ఇద్దరూ మద్యం తాగి ఉంటారన్న అనుమానాలను పోలీసులు వ్యక్తంచేశారు.
ఒకే అమ్మాయిని ప్రేమించి...
ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించి ఆమె కోసం గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మరెవరైనా ఈ ఇద్దరు యువకులను పెట్రోల్ పోసి కాల్చి చంపారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ కుమారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు.