షాక్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జి రాజీనామా, అసలేం జరిగింది?
Recommended Video
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్. ఈ కేసులో ఉదయం తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి, సాయంత్రానికి రాజీనామాను సమర్పించారు. తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
2014 తర్వాత మాట మార్చారు, రాజకీయ ఒత్తిడి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేతపై అసదుద్దీన్
ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్కు పంపించారని తెలుస్తోంది. ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేశారు.
తీర్పు తర్వాత కొద్ది గంటల్లో రాజీనామా
ఎన్ఐఏ జడ్జిగా ఉన్న రవీందర్ రెడ్డి రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, మక్కా మసీదు కేసులో తీర్పు వచ్చిన రోజే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తీర్పు తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారని సమాచారం. ఆయన తెలంగాణ జ్యూడిషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా అధికారికంగా పేర్కొన్నారని తెలుస్తోంది. కానీ తీర్పు, బెదిరింపుల తర్వాత రాజీనామా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
రెండు నిమిషాల్లో తీర్పు
మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సోమవారం నాడు రెండు నిమిషాల్లో తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అయిదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులుగా ఉన్న దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అసిమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్ఐఏ స్పందన
మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షిస్తున్ననట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. తీర్పు కాపీ చూశాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
2007 మే 18న మధ్యాహ్నం 1.15 గం.ల సమయంలో మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఐఈడీ బాంబు పేలడంతో తొమ్మిది మంది మరణించారు. 58 మంది గాయపడ్డారు. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో సుమారు అయిదువేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి.
సీబీఐ, ఎన్ఐఏ ఛార్జీషీట్లు
ఘటన తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అయితే ఉగ్రవాద దుశ్చర్య కావడంతో భారత హోం మంత్రిత్వ శాఖ కేసు దర్యాప్తు బాధ్యతను 2011 ఏప్రిల్ 4న ఎన్ఐఏకి అప్పగించింది. అప్పట్లో రెండు కేసులను తిరిగి నమోదు చేసిన ఎన్ఐఏ మొత్తం పదిమంది నిందితులను గుర్తించింది. సీబీఐ ఒకటి, ఎన్ఐఏ రెండు ఛార్జీషీట్లను కోర్టులో నమోదు చేశాయి. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.