స్థానిక సమరానికి రె’ఢీ‘ : తేదీలను ఈసీకి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.
ఈసీ కసరత్తు
ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాల్లో 535 జెడ్పీటీసీ, 5875 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఈసీ ఓకే
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. దీనికి సీఈసీ కూడా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి గతంలో లేఖ రాసింది.
తేదీల ఖరారు ?
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ప్రతిపాదించింది. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే స్థానిక సంస్థల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.