పాక్ మీద వ్యూహంపై మోడీ ముందడుగు: సీపీఐ నారాయణ ప్రశంస, రాహుల్ థ్యాంక్స్
హైదరాబాద్: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ శుక్రవారం నాడు అన్నారు.
యూరీ సైనిక క్యాంపులో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను వ్యూహాత్మకంగా ఒంటరిని చేసే ప్రయత్నాల్లో ప్రధాని మోడీ ముందడుగు వేశారని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్లో జరగాల్సిన సార్క్ సమావేశాలను బహిష్కరించడంతో పాటు సార్క్ సభ్యదేశాల మద్దతును కూడగట్టడంలో సఫలమయ్యారన్నారు.
యుద్ధానికి యుద్ధమే సమాధానం కాదని, పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు మరింత ప్రయత్నం చేయాలని ఆయన ప్రధాని మోడీకి హితవు పలికారు.
ఇదిలా ఉండగా, భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్, ఆక్టోబస్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
మోడీ చేసిన మంచి పని: రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా 'దియో రియా టూ ఢిల్లీ యాత్ర' పేరిట 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
శుక్రవారం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాహుల్ వ్యాఖ్యానించారు. తాను, తమ పార్టీ పాక్పై కేంద్రం తీసుకున్న చర్యకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మోడీకి థ్యాంక్స్ అని, ఎందుకంటేరెండున్నరేళ్ల క్రితం భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన చేసిన తొలి మంచి పని ఇదే అన్నారు.