ఇది ఐటీ శాఖ టార్గెట్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.60వేల కోట్లు
Recommended Video
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు రూ.60వేల కోట్ల పన్నులు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐటీ శాఖ రూ.49,775 కోట్ల పన్నులు వసూలు చేయడం గమనార్హం.
ఆంధ్రా బ్యాంకులే అగ్రస్థానం
ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ఐటీ శాఖ ప్రధాన కమిషనర్ ఎస్పీ చౌదరి మాట్లాడారు. ఏటా పన్నులు కడుతున్న కార్పొరేట్ కంపెనీల్లో ఎన్ఎండీసీ లిమిటెడ్, ఆంధ్రా బ్యాంక్లు అగ్రస్థానంలో ఉన్నాయని తెలిపారు.
అదే మా లక్ష్యం
‘2018-2019 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.60,845 కోట్ల పన్నులు వసూలు చేయాలని అనుకుంటున్నాం. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 లక్షల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. వచ్చే ఏడాదికి 10.13 లక్షల రిటర్నులు దాఖలవ్వాలన్నది మా లక్ష్యం' అని చౌదరి చెప్పారు.
బినామీ ఆస్తుల చట్టం కింద..
అంతేగాక, ‘తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం 36.1 లక్షల మంది పన్నులు కట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టం కింద 83 బినామీ ఆస్తులను జప్తు చేశాం. 2018 జూన్ వరకు 108 బినామీ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఐటీ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.40.95 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేశారు. ఈ ఏడాది రూ.14.28 కోట్లు వసూలు చేశారు' అని చౌదరి వివరించారు.
అరెస్ట్ వారెంట్లు జారీ
‘2017 నుంచి 2018 వరకు లెక్కల్లోకి రాని ఆస్తుల విలువ రూ.1,166.97 కోట్లు. ఈ ఏడాది రూ.285.75 కోట్లు. 2017 నుంచి 2018 వరకు బినామీ ఆస్తులపై 415 సర్వేలు జరిగాయి. పన్నులు ఎగ్గొట్టిన వారిలో కొందరు దోషులుగా తేలగా, మరికొందరికి అరెస్ట్ వారెంట్లు జారీ చేశాం' అని ఎస్పీ చౌదరి తెలిపారు.