అనుమానాస్పద ఖాతాదారుల సమాచారమివ్వని బ్యాంకులపై చర్యలు,ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో చెక్
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసినవారి వివరాలను ఆదాయపు పన్నుశాఖ సేకరిస్తోంది. ఆయా బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్.
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసినవారి వివరాలను ఆదాయపు పన్నుశాఖ సేకరిస్తోంది. ఆయా బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసిన సమాచారాన్ని తమకు పంపాలని ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు అధికారులను కోరింది. సమాచారం పంపని బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకొంటామని ఐటి శాఖ అధికారులు హెచ్చరించారు.
అక్రమార్కులపై వేట ప్రారంభించిన ఆదాయపు పన్ను శాఖ
నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత రద్దుచేసిన పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం.
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత అక్రమార్కులు నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకుగాను అనేక వక్రమార్గాలను అనుసరించారు. ఈ మార్గాల ద్వారా తమ నల్లధనాన్ని మార్పిడి చేసుకొన్నారు.
బకాయిలు వసూల్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో 80 వేల కోట్ల అప్పులు చెల్లించారు
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆయా బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు జమ చేసిన అంశాన్ని ఆదాయపు పన్నుశాఖాధికారులు సేకరిస్తున్నారు. అయితే బ్యాంకుల వద్ద ఉన్న సమాచారాన్ని సమగ్రంగా తమకు ఇవ్వాలని ఆదాయపుపన్నుశాఖాధికారులు ఆదేశించారు.
ప్రత్యేక సాఫ్ వేర్ ను తయారు చేసిన ఆదాయపు పన్నుశాఖ
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత ఏఏ బ్యాంకు ఖాతాల్లో ఏ మేరకు నగదు డిపాజిట్ అయిందనే విషయమై ఆదాయపుపన్నుశాఖ ఆరాతీస్తోంది. ఈ మేరకు ఐటి శాఖాధికారులు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేశారు. ఈ సాఫ్ట్ వేర్ ఆధారంగా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన నగదు వివరాలను ఆదాయపు పన్నుశాఖ సేకరించనుంది.ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నుశాఖకు సమాచారం చేరవేయనుంది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ పై బ్యాంకు అధికారులకు బుదవారం నాడు ఆదాయపు పన్నుశాఖాధికారులు శిక్షణ ఇచ్చారు.
జనవరి మాసాంతానికి ప్రతి ఖాతాదారుడి సమాచారం ఇవ్వాల్సిందే
తాము అడిగిన సమాచారాన్ని బ్యాంకులు ఇవ్వాల్సిందేనని ఆదాయపు పన్నుశాఖాధికారులు తేల్చి చెప్పారు. ఎపిజివిబి, దక్కన్ గ్రామీణ బ్యాంకుల నుండి తమకు సమగ్ర సమాచారం రాలేదని ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్నుశాఖాధికారులు బ్యాంకులను హెచ్చరించారు. పెద్ద నగదునోట్లను రద్దుచేసిన తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నగదు వివరాలను ఐటిశాఖ కోరుతోంది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కరెంట్ ఖాతాల్లో 12.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి సమాచారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ నెలాఖరుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ లో ఈ వివరాలను అప్ లోడ్ చేయాలని ఐటి ఇంటలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గోపినాథ్ హెచ్చరించారు.
సేవింగ్స్ ఖాతాదారులపై కూడ నిఘా
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కూడ సేవింగ్స్ ఖాతాల్లో ఏ మేరకు నగదు డిపాజిట్ అయిందనే విషయమై బ్యాంకు అధికారుల నుండి సమాచారాన్ని సేకరిస్తోంది. సేవింగ్స్ ఖాతాల్లో రెండున్నర లక్షలకు మించి జమ చేసిన వారి వివరాలను పంపాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆదేశించారు. పెద్ద నగదు నోట్ల రద్దు కంటే ముందుగానే ఈ డబ్బును జమ చేస్తే ఆ వివరాలను కూడ ఇవ్వాలని ఆదాయపు పన్నుశాఖ కోరింది.ఖాతాదారుల ఆర్థిక మూలాలు, ఇతరత్రా వివరాలపై ఐటిశాఖ విచార చేస్తోంది.
సమాచారం ఇవ్వకపోతే విచారణ,జరినామా
ఆదాయపు పన్నుశాఖాధికారులు తాము అడిగిన సమాచారాన్ని బ్యాంకు అధికారులు ఇవ్వాల్సిందేనని ఆదాయపు పన్నుశాఖాధికారులు తేల్చి చెప్పారు.ఈ నెల 31వ, తేది లోపుగా తాము అడిగిన సమాచారాన్ని బ్యాంకు అధికారులు ఇవ్వలేకపోతే విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆదాయపు పన్నుశాఖాధికారులు చెబుతున్నారు.తమకు సహకరించని బ్యాంకులకు జరిమానాలను విధిస్తామని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.
ఆదాయపు పన్నుశాఖ వద్ద అనుమానాస్పద ఖాతాలు
ఆదాయపు పన్నుశాఖ వద్ద అనుమానాస్పద ఖాతాల వివరాలున్నాయి. ఇప్పటికే కోటి మంది కాతాదారులను ఆదాయపు పన్నుశాఖ సేకరించింది. వారి వివరాలను సేకరించింది. ఇంకా అనుమానాస్పద ఖాతాల గురించి ఆదాయపు పన్నుశాఖ ఆరా తీస్తోంది. అనుమానాస్పద ఖాతాల యజమానులను ఆదాయపు పన్నుశాఖాధికారులు విచారించనున్నారు.