వేషం మార్చి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని లక్ష్యంగా ఎంచుకొని ఐటీ, ఈడీ చేస్తున్న దాడులు కొనసాగుతున్నాయి. తమ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి మల్లారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్ళల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తీసేకొద్దీ ఆస్తులకు సంబంధించి కాగితాలు బయటకు వస్తున్నాయని, మరో మూడురోజుల సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మల్లారెడ్డిపై దాడి చేయాలనే నిర్ణయాన్ని ఇప్పటికప్పుడు తీసుకున్నది కాదని తెలుస్తోంది. గత కొంత కాలంగా మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాల పైన, బంధువులు , సన్నిహితుల కార్యకలాపాల పైన పూర్తిస్థాయిలో అధికారులు నిఘా ఉంచారు. పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాతే నేరుగా దాడులకు దిగినట్లు సమాచారం. గత పది సంవత్సరాలుగా మల్లారెడ్డి చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు వారికి సోదాల్లో రూ.8.80 కోట్ల నగదుతోపాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
కొద్ది నెలలు క్రితం ఐటి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా వేషం మార్చి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. ఈ విధంగా వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని లొసుగులు ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాతే ఐటీ అధికారులు దాడులకు దిగారు. బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. అందులో ఎన్ని బయటపడతాయో నిర్థారించుకొని ఆ ప్రకారం మరికొంతమంది అధికారులను సోదాలకు పిలిపించే అవకాశం ఉంది.