బాల్క సుమన్ వర్సిటీలో ఫ్రీ భోజనం తిని: రేవంత్, అదంతా ఎత్తుకెళ్లారని.. ఐటీ దాడులపై రివర్స్!
హైదరాబాద్/కొడంగల్: ప్రజల తరఫున ఎవరు ప్రశ్నిస్తే వారిని కేసీఆర్ టార్గెట్ చేసుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఏదో కేసీఆర్ పైన దూకుడుగా మాట్లాడుతున్నానని తనపై ఐటీ దాడులు జరిగాయని అనుకున్నా, కోదండరాం, విమలక్కలపైనా జరిగిందని గుర్తు చేశారు. చుక్కా రామయ్య అయినా, జానారెడ్డి అయినా ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.
నాపై కాదు, కేటీఆర్-అమిత్ షా కొడుకుపై దాడి చేయాలి: రాత్రంతా రేవంత్ రెడ్డి విచారణ, కీలక సమాచారం
తన విధానాలను, తప్పును తప్పు చెప్పే ప్రయత్నాలు చేస్తే టార్గెట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. రామేశ్వర రావుకు అక్రమ భూ కేటాయింపులు గురించి, నేరేళ్ల ఇసుక బాధితుల గురించి, ఖమ్మంలో గిట్టుబాటు ధరల గురించి, ఆదివాసీల గురించి.. ఇలా ఎన్నింటినో ప్రశ్నించానని చెప్పారు. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ముసుగులో వందల కోట్లు కొల్లగొట్టాలనుకుంటే దోపిడీకి గురి కాకుండా అడ్డుకున్నానని చెప్పారు.
బాల్క సుమన్ వర్సిటీలో ఫ్రీగా భోజనం పెడితే తిని, మందు తాగేవాడు
కేసీఆర్, కేటీఆర్లు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంట్లోనే పదిమంది అమెరికాలో బతుకుతున్నారని చెప్పారు. నేను ముప్పై ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, ఎందుకు సంపాదించనని అన్నారు. బాల్క సుమన్ యూనివర్సిటీలో ఉన్న వ్యక్తి అని, ఆయనకు ఏముందని, ఎవరైనా ఫ్రీ భోజనం పెడితే తిని, మందు పోస్తే తాగి జై తెలంగాణ అనే వ్యక్తి అన్నారు. బాల్క సుమన్ బతుకు ఏమిటో యూనివర్సిటీలో అడిగినా చెబుతారన్నారు. ఈ రోజు బాల్క సుమన్ కారులో ఎక్కి తిరుగుతున్నాడని, నేను అడిగానా అని నిలదీశారు. నీ బతుకేంది అని బాల్క సుమన్ను ప్రశ్నించారు. కేసీఆర్ తినగా నమలలేని బొక్కలు పక్కన వేస్తే, నమిలితినే నువ్వు నా గురించి ప్రశ్నిస్తావా, రా నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం అని రేవంత్ అన్నారు. నా ఊరికి వచ్చి అడగాలన్నారు. నా ఊరుకు అందరూ రావొచ్చన్నారు.
గోడల మీద రాతలు రాస్తే తప్పా
మా పూర్వీకులకు వేల ఎకరాల భూమి ఉండెనని రేవంత్ అన్నారు. చెప్పుల్లేని వారు, వలసలు వచ్చిన వాళ్లు, పాస్పోర్టు బ్రోకర్లు, అడుక్కు తినేవాళ్ల కంటే నేను అధ్వాన్నమా అన్నారు. నేను గోడలు రాతలు రాశానని, పార్టీ కార్యకర్తగా గోడ మీద రాతలు రాస్తే తప్పా అన్నారు. నేను వ్యాపారం చేశానా, దొంగతనం చేశానా అనేది ప్రశ్న అన్నారు. వ్యాపారంలో అవకతవకలు ఉంటే విచారించుకోవచ్చన్నారు.
నా సవాల్ పక్కదారి పట్టించేందుకే తెరపైకి సుమన్
2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఆస్తులపై, 2007 నుంచి నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని కేసీఆర్కు సవాల్ చేశానని రేవంత్ చెప్పారు. కానీ తన సవాల్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు బాల్క సుమన్ను తెరపైకి తెచ్చి, నోటికి వచ్చింది తిట్టిపిచ్చారన్నారు. మనం వెళ్తుంటే కొన్ని మొరుగుతాయని, కొన్ని కరువడానికి కూడా వస్తాయని, నేను పట్టించుకోనని, ఎందుకంటే వాటి మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. కానీ ప్రపంచంలో ఉద్యమకారుడు ఎవరైనా కేసీఆర్లా చేశారన్నారు.
ఇదీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం
ఒకపూట తర్వాత ఖమ్మం ఆసుపత్రిలో ఉండగా, పాల గ్లాస్తో పాలు తాగితే, ఓయు విద్యార్థులు పాల బదులు మా రక్తం తాగమని ఉద్యమిస్తే, 1200 మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ వల్ల వచ్చిందా అన్నారు. అసలు కేసీఆర్ పైన కేసు ఉందా అన్నారు. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడని, పార్టీని విస్తరించుకునేందుకు రకరకాల చర్యలు చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నాడని, తెలంగాణను మోసం చేసి, ఆళ్ల నరేంద్రను చంపేశాడని, విజయశాంతిని నడిబజార్లో వదిలేశాడని, రవీంద్ర నాయక్ను ఆఫీస్ వద్దే కొట్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో స్కాంలు చేశాడని, ఇతను ఉద్యమకారుడా అన్నారు.
నా ఆస్తి విలువ ఎలా పెరిగిందంటే
2007లో నేను ఇచ్చిన అఫిడవిట్, 2014లో ఏమిచ్చాను, రాజకీయాల్లోకి రాకముందు ఎంత ఆస్తి ఉండే, నాకు ఇప్పుడు ఎంత ఉందో చూడవచ్చునని చెప్పారు. నా మీద కోపంతో లాజిక్ మిస్సయి మాట్లాడుతున్నారని చెప్పారు. 2009లో ఎంత విలువ ఉందో అంతే రిజిస్టర్ వ్యాల్యూను తాను చూపించానని, 2014లో మార్కెట్ వ్యాల్యూ అడిగితే దానిని పేర్కొన్నామని చెప్పారు. అన్ని భూముల ధరల విలువలు పెరిగాయన్నారు. తనకు ఉన్న అవే ఆస్తుల విలువ పెరిగిందని, ఆస్తులు పెరగలేదని, ఆ లాజిక్ వారు మిస్సయ్యారన్నారు. బాల్క సుమన్ ఒకప్పుడు డ్రాయర్ లేకుండా తిరిగావని, ఇప్పుడు దుస్తులు వేసుకుంటున్నావని, అలాగే వ్యాల్యూ పెరిగిందన్నారు.
నా సమాచారం తీసుకెళ్లారు... రేవంత్ రివర్స్ ఆరోపణ
ఐటీ అధికారులు తన ఇంటికి వచ్చింది కేవలం అడగడానికి కాదని, తన వద్ద వజ్రవైడూర్యాలు, గుప్త నిధులు, కిరీటాలు, వజ్రాలతో పొదిగిన కత్తులు ఉన్నాయని చెబితే, వారు వచ్చారని, వీటితో భారతదేశాన్ని వంద ఏళ్లు నడపవచ్చునని వచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ వద్ద ఏం దొరికిందో సోదాలు నిర్వహించిన అధికారులను ప్రెస్ నోట్ విడుదల చేయమని కోరుకోవచ్చునని చెప్పారు. రామేశ్వర రావు సహా పలువురిపై కేసులు వేసేందుకు తాను ఆర్టీఐ ద్వారా తెచ్చిపెట్టుకున్న సమాచారాన్ని వారు కట్టలు కట్టి తీసుకెళ్లారని అంటానని, నేను వారిపై కేసులు వేయకుండా ఆపేందుకు అధికారులను ఇంటికి పంపించి, సమాచారాన్ని తీసుకు వెళ్లారని అంటున్నానని చెప్పారు. నాపై ఉన్న సమాచారం తీసుకెళ్లేందుకు ఒకటి, రెండు నా వద్ద చిన్నది దొరికినా పెద్దగా చేయాలనుకున్నారని అన్నారు.