అసంపూర్తిగా ఇంటర్ పునఃపరిశీలన ఫలితాలు..! ఆందోళనలో విద్యార్థులు..!!
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల మనో వేదన ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. రి-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ జరిపించి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని చెప్పిన ఇంటర్ బోర్డ్ ఆ దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. రీ వెరిఫికేషన్ తర్వాత ప్రకటించిన ఫలితాల్లో అనేక లోపాలు ఉన్నాయని విద్యార్థలతో పాటు వారి తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. కోర్టుకు ఇచ్చిన మాటను కూడా ఇంటర్ బోర్డ్ నిలబెట్టుకోలేక పోయిందని ఇంటర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్సెట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని తెలుస్తోంది.
ఇంకా పూర్తికాని 8 వేల జవాబుపత్రాల స్కానింగ్..! ఆవేదనలో విద్యార్థలు..!!
హైకోర్టుకు ఇంటర్ బోర్డు ఇచ్చిన హామీ గడువు ముగిసి నాలుగు రోజులు దాటినా, ఇంటర్లో తప్పిన వారి జవాబుపత్రాల పునఃపరిశీలన ఫలితాలు పూర్తి కాలేదు.ఉత్తీర్ణులైనా..మార్కులు తక్కువ వచ్చాయని, పెరిగే అవకాశం ఉందని ఆశాభావంతో దరఖాస్తు చేసుకున్నవారి ఫలితాలను శుక్రవారం విడుదల చేసినా- అవి కూడా అసంపూర్ణంగానే ఉన్నట్లు సమాచారం. ఇలా ఎందుకు ఆలస్యమవుతోందన్నదానిపై బోర్డు అధికారులు నోరు తెరవడం లేదు. ఇంటర్ ఫలితాల పొరపాట్ల నేపథ్యంలో- తప్పిన 3.82 లక్షలమంది ప్రథమ, ద్వితీయ విద్యార్థుల జవాబుపత్రాలను పునఃపరిశీలన చేసి మే 27వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు 15వ తేదీనే హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు 27వ తేదీ రాత్రి 9 గంటలకు..మార్కులు పెరిగి పాసైనవారికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించింది.
పాసైనవారి జవాబుపత్రాలదీ అంతే..! స్పష్టత లేని మార్కుల కౌంటింగ్..!!
జవాబుపత్రాలను వెబ్సైట్లో ఉంచింది. ఇంకా 19,788 పత్రాల స్కానింగ్ పూర్తికాలేదని, 28వ తేదీలోపు చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే 31వ తేదీ సాయంత్రం జవాబుపత్రాలను వెబ్సైట్లో ఉంచామని, ఇంకా 8 వేల పత్రాల స్కానింగ్ జరుగుతోందని శుక్రవారం పేర్కొంది. ఎందుకు జాప్యం అవుతోందన్నది మాత్రం చెప్పలేదు. సుమారు 40 వేల మంది విద్యార్థులు 85 వేల జవాబుపత్రాలకు పునఃపరిశీలన గురించి దరఖాస్తు చేశారు. వాటిని కూడా శుక్రవారం వెబ్సైట్లో ఉంచామని, డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్బోర్డు పేర్కొంది. కానీ దాదాపు 79 వేల పత్రాలను మాత్రమే వెబ్సైట్లో ఉంచినట్లు తెలిసింది. అంటే ఇంకా 6 వేల జవాబుపత్రాలను స్కానింగ్ చేయాల్సి ఉంది.
ఎంసెట్ అధికారుల ఎదురుచూపులు..! సాగదీస్తున్న ఇంటర్ అదికారులు..!!
ఇంటర్బోర్డు ఫలితాలను వెల్లడించడంతోపాటు, డేటాను ఎంసెట్ అధికారులకు పంపిస్తేనే ఎంసెట్ ర్యాంకులు వెల్లడించడానికి వీలవుతుంది. బోర్డు అధికారులు గడువులు మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాల డేటా ఇవ్వకపోవడంతో, తెలంగాణతో పాటు ఏపీ ఎంసెట్ ర్యాంకుల వెల్లడి సైతం ఆగిపోయింది.
పదో తరగతికి తగ్గిన పునఃపరిశీలన దరఖాస్తులు..! పెరిగిన ఉత్తీర్ణత శాతమే కారణం..!!
పదో తరగతి జవాబుపత్రాలకు పునఃపరిశీలన దరఖాస్తుల సంఖ్య ఈసారి తగ్గింది. 6వేల జవాబుపత్రాలకే దరఖాస్తులు అందాయి. గతేడాది ఆ సంఖ్య సుమారు 10 వేలు. ఈసారి పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత 92 శాతం దాటడంతో, దరఖాస్తు చేసేవారు తగ్గిపోయారని భావిస్తున్నారు. పునఃపరిశీలన ఫలితాలను మరో వారం రోజుల్లో వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్ చెప్పారు. పదో తరగతిలో గ్రేడ్ల విధానం ఉండటంతో, ఒక వేళ మార్కులు పెరిగినా గ్రేడ్ మారితేనే కొత్తమెమోలు ఇస్తారు. లేకుంటే పాతవే ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.