ఇండిపెండెన్స్ డే : జెండా పండుగకు గోల్కొండ కోట రెడీ.. మువ్వన్నెల జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో జెండా పండుగ. ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు. చారిత్రక నేపథ్యం గల గోల్కొండ కోట వద్ద ఇండిపెండెన్స్ డే ఏర్పాట్లు నిన్నటితో పూర్తయ్యాయి. గురువారం ఉదయం గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరిసరా్లో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. జాగీలాలతో పరిసరాలను జల్లెడ పడుతున్నారు.
గోల్కొండ కోటలో ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జెండా పండుగ వేదికను ప్రభుత్వం మార్చింది. అంతకుముందు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను .. గోల్కొండ కోటకు మార్చారు. 2014 నుంచి వరుసగా గోల్కొండ కోటలోనే జెండాను సీఎం ఆవిష్కరిస్తున్నారు. వరుసగా ఆరోసిరా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండ ఎగరేయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
రిహార్సల్స్ ..
గోల్కొండ కోటలో నిర్వహించే జెండా పండుగ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. జెండా వందనం, సీఎం కాన్వాయ్ కోసం పోలీసు బలగాలు రిహార్సల్స్ నిర్వహించాయి. జెండా పండుగ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల కోసం రిహార్సల్స్ కూడా చేశాయి. పోలీసులు, అధికారులకు మెడల్స్ అందిస్తారు సీఎం కేసీఆర్. తర్వాత శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. తెలంగాణ ఆహార్యం, సంస్కృతిని ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.
కోట ముస్తాబు ..
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ శోభ ఉట్టిపడుతుంది. రాత్రి సమయంలో విద్యుత్ కాంతుల దగదగలతో ఆకట్టుకుంటుంది. గత మూడురోజులుగా పోలీసు బలగాలు సన్నాహక ప్రదర్శనల్లో నిమగ్నమయ్యాయి. ఉదయం, సాయంత్రం కోటలోని తారామది మసీదు వద్ద జెండా ఎగరేసే ప్రాంతంతోపాటు ప్రధాన గేటు వద్ద బలగాలు పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. పోలీసు బ్యాండు మధ్య పరేడ్ను ప్రత్యేక బలగాలు లయబద్ధంగా నిర్వహిస్తున్నాయి. పరేడ్ రిహార్సల్స్ను కోటకు వచ్చిన వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోవైపు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వచ్చే అతిథులు ఆశీనులయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకలను దూరం నుంచి చూసేవారి కోసం భారీ ఎల్ఈడీ స్కీన్లను కూడా ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం కోట ప్రధాన ద్వారం వద్ద పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించడంతో .. జెండా పండుగ వేడుకు మొదలవుతుంది. అక్కడినుంచి జెండా ఎగరవేసే తారామతి వద్దకు చేరుకుంటారు. జెండా ఆవిష్కరించాక .. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం కేసీఆర్.