పార్టీ కార్యాలయాల్లో పంద్రాగస్ట్ : జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలు
హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ పార్టీ కార్యాలయాలు, అధికార భవనాల్లో ముఖ్య నేతలు జెండా వందనం చేశారు. 73వ స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉగ్ర దాడుల జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో .. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే తనిఖీలు చేపట్టారు.
గాంధీభవన్లో..
గాంధీభవన్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. తర్వాత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వీరుల ప్రాణత్యాగంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తుచేశారు. జాతి అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నేతలు పాల్గొన్నారు. వీరుల త్యాగఫలం వల్లే మనం స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో ..
ఇటు బీజేపీ కార్యాలయంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇతర నేతలు పాల్గొన్నారు. యోధుల పోరాటం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందని నేతలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ భవన్లో ..
తెలంగాణ భవన్లో ఘనంగా జెండా పండుగ జరిగింది. జాతీయ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు దానం నాగేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్కు మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. వారికి కేటీఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు స్పీకర్ కార్యాలయంలోజాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగరవేశారు. టీడీపీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. జాతీయ పతాకాన్ని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.
టీజేఎస్ ఆఫీసులో ..
ఇటు తెలంగాణ జనసమితి కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగేందుకు నేతలు పోరాటం చేశారన్నారు. వారి ప్రాణత్యాగ ఫలితంతోనే స్వాతంత్ర్యం సిద్ధించిందని చెప్పారు.