నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల
భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో ఇద్దరు జవాన్లు కూడా నేలకొరిగారు. కల్నల్ మరణంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే సంతోష్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వకారణంగా ఉందని వారంతా చెప్పారు.
చైనా దాడిలో తెలుగు అధికారి మృతి.. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట.. అంతటా విషాదం..
ఇదీ సంతోష్ కుటుంబం..
సూర్యాపేట విద్యానగర్కు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గడిచిన 15 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. 16-బిహార్ రెజిమెంట్ కమాండర్ హోదాలో గత ఏడాదిన్నరగా ఆయన చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్కు భార్య సంతోషి, కూతురు అభిజ్ఞ(9), కొడుకు అనిల్(6) ఉన్నారు. తండ్రి ఉపేందర్ రిటైర్డ్ బ్యాంక్ అధికారికాగా, తల్లి మంజుల గృహిణి. సంతోష్ చనిపోయే సమయానికి ఆయన భార్య సంతోషి ఢిల్లీలోనే ఉన్నారు.
సరిహద్దులో చైనా కిరాతకం గుర్తుందా? గొర్రెలమంద, పొగమంచు మాటున కాల్పులు.. మళ్లీ ఇన్నాళ్లకు మరణాలు..
గర్వంగా ఉంది.. కానీ..
‘‘నాకు ఒక్కడే కొడుకు. దేశం కోసం పోరాడుతూ అమరుడు కావడం చాలా గర్వంగా ఉంది. కానీ ఒక తల్లిగా.. కొడుకును పోగొట్టుకున్నందుకు బాధగానూ ఉంది. సంతోష్ చనిపోయినట్లు ఆర్మీ అధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే.. మా కోడలు(సంతోషిణి) ఫోన్ చేసి మాకు విషయం చెప్పింది. నిజానికి ఆదివారం రాత్రే వాడు మాతో మాట్లాడాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పాడు..''అంటూ కన్నీటిపర్యంతమయ్యారు కల్నల్ సంతోష్ మాతృమూర్తి మంజుల.
ఉన్నతవిద్యావంతుడు..
సూర్యాపేటలో ప్రైమరీ స్కూల్ తర్వాత సంతోష్ బాబు.. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరారు. చదువుపై ఇష్టంతో సైన్యంలో చేరకముందు, తర్వాత కూడా ఆయన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. పుణెలోని ఎన్డీయేలో డిగ్రీ, అనంతరం డెహ్రడూన్ ఐఎంఏలో పీజీ చదివారు. 15 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తూ.. కల్నల్ ర్యాంకులో 14వ బిహార్ బెటాలియన్ కు కమాండింగ్ ఆఫీసర్ గా గాల్వాన్ లోయలో విధులు నిర్వహిస్తూ అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం అంత్యక్రియలు..
ఆర్మీ వర్గాలు, సూర్యాపేటలోని కుటుంబీకులు చెప్పిన వివరాలను బట్టి కల్నల్ సంతోష్ బాబు మృతదేహాన్ని లదాక్ నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం నాటికి ఆయన పార్థివదేహం హైదరాబాద్ కు చేరుతుందని, అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలిస్తారని, బుధవారం మధ్యాహ్నమే సూర్యాపేటలో అధికారిక లాంఛనాలతో కల్నల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.