చేదు నిజం: ప్రపంచ నిరక్షరాస్యుల్లో 35 శాతం భారత్లో, 34 శాతం తెలంగాణలో!
హైదరాబాద్ : అక్షరాస్యత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చుపెడుతూ ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా యునెస్కో నివేదిక ఒక చేదు నిజం వెల్లడించింది.
ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో 35 శాతం మంది మన దేశంలోనే ఉన్నారని యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతోంది. యునిసెఫ్ విడుదల చేసిన నిరక్షరాస్యుల జాబితాలో భారత్ లో 35 శాతం మంది నిరక్షరాస్యులున్నట్టు తేలింది.
దేశ వ్యాప్తంగా 35 శాతం నిరక్షరాస్యలు ఉంటే, ఒక్క తెలంగాణలోనే 34 శాతం మంది నిరక్షరాస్యులున్నారనేది షాక్ ఇచ్చే విషయమే. ఈ విషయాన్ని వయోజన విద్యా సంచాలకుడు బి.సుధాకర్ కూడా వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,000 వయోజన విద్యాకేంద్రాలు ఉన్నప్పటికీ, రాత్రి బడుల్లో చదివేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ విద్యా కేంద్రాలకు రాత్రిపూట వచ్చే వారి మనస్తత్వం కూడా విచిత్రంగా ఉంటోందని, తమ పిల్లలకు చదువు తప్పనిసరి అనే విషయాన్ని ఇప్పటికీ వారు గుర్తెరగడం లేదని, ఇక స్కూళ్లలో డ్రాపవుట్స్ ను తగ్గించే విషయంపై కూడా దృష్టిపెట్టామని ఆయన చెప్పారు.