శ్రీమంతుడులా 'స్వదేశ్'కు స్ఫూర్తి ఐన తెలుగు మహిళకు అమెరికాలో చేదు
గత ముప్పై ఏళ్లుగా అమెరికాలోని బెల్ ఎయిర్లో నివసిస్తున్న, అమెరికన్ సిటిజన్ అయిన తెలుగు మహిళ పిల్లలమర్రి అరవిందకు అమెరికాలో చేదు అనుభవం ఎదురయింది.
హైదరాబాద్: గత ముప్పై ఏళ్లుగా అమెరికాలోని బెల్ ఎయిర్లో నివసిస్తున్న, అమెరికన్ సిటిజన్ అయిన తెలుగు మహిళ పిల్లలమర్రి అరవిందకు అమెరికాలో చేదు అనుభవం ఎదురయింది. ఆమె వయస్సు 47. ఆమె వెళ్తుండగా పోలీసులు అడ్డగించి ప్రశ్నించారు.
హిందీలో షారుక్ ఖాన్ నటించిన 'స్వదేశ్' సినిమాకు పిల్లలమర్రి అరవింద, ఆమె భర్త కూసుమంచి రవిలు స్ఫూర్తినిచ్చారు. తెలుగులో మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలా.
మేరీల్యాండులోని బెల్ ఎయిర్లో ఆమె డిసెంబర్ 21వ తేదీన మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఆ సమయంలో బెలి ఎయిర్ పోలీసు డిపార్టుమెంటు అధికారులు తనను అడ్డగించారని ఆమె చెప్పారు.
ఆమె నడకకు వెళ్లగా.. పోలీసులు అడ్డగించి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దానికి ఆమె తాను మార్నింగ్ వాక్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అధికారులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు.
ఎందుకు తనను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె.. పోలీసు అధికారిని అడిగారు. తమకు ఎవరో ఫోన్ చేశారని వాళ్లు సమాధానం ఇచ్చారు. మరో పోలీసు అధికారి కూడా వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు.
గుర్తింపు కార్డు ఎందుకు లేదని, ఇక్కడ చట్టవ్యతిరేకంగా ఉంటున్నారా? అని ప్రశ్నించారు. తమ కంప్యూటర్లో ఆమె పేరును సరిచూసుకున్న తర్వాత విడచిపెట్టారు. ఆమె ఇక్కడ 30 ఏళ్లుగా ఉంటున్నట్టు, బెల్ ఎయిర్ హైస్కూలులో చదివినట్టు తేలింది.
ఈ చేదు అనుభవాన్ని ఆమె జనవరి 17న టౌన్ కమిషనర్ల బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం లేదని, అందరి పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత గురించే చెబుతున్నానని చెప్పారు.
పోలీసులు తనను ఆపినప్పుడు తొలుత తన రంగును చూసి అనుమానిస్తున్నారని అనుకోలేదని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న బెల్ ఎయిర్ పోలీసు అధిపతి చార్లెస్ మూర్ మాట్లాడుతూ.. వలస స్థితిగతులపై సాధారణ పరిస్థితుల్లో పోలీసు అధికారులు ప్రశ్నించరన్నారు. అనుమానాస్పద వ్యవహారాలపై అందిన సమాచారం అధారంగా ఆమెను ప్రశ్నించారన్నారు. అయితే తమ శాఖ అధికారులు సున్నితంగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు.
పిల్లలమర్రి అరవింద భారత్లో పుట్టారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు అమెరికా బాట పట్టారు.