కూతురు పెళ్లికని అమెరికా వెళ్లి తెలుగువ్యక్తి అదృశ్యం: చేతులెత్తేశారు
హైదరాబాద్: 55 ఏళ్ల తెలుగు వ్యక్తి ఒకరు అమెరికాలో తన కూతురు పెళ్లి కోసమని వెళ్లి, అదృశ్యమయ్యాడు. అతను పెళ్లి వేడుక నుంచి కనిపించకుండా పోయాడు. అతని పేరు ప్రసాద్. హైదరాబాదుకు చెందిన వాడు. కూతురు పెళ్లి నేపథ్యంలో అతను జనవరి నుంచి అమెరికాలో ఉంటున్నారు.
ఫిబ్రవరి 26వ తేదీన వెనక్కి రావాల్సి ఉంది. అయితే, అతను అదృశ్యం కావడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగించింది. మూడురోజులు గడిచినా ఆయన ఆచూకీ లభించకపోవటంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ప్రసాద్ కుమార్తె దుర్గ వివాహం గుత్త రాజేశ్తో శనివారం జరిగింది.
కాలిఫోర్నియాలోని వాల్నట్గ్రూవ్లో ఉన్న గ్రాండ్ ఐలాండ్ మెన్షన్లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం నవ దంపతులతో కలిసి ఫొటోలు దిగిన ప్రసాద్... కాసేపటికే బయటకు వెళ్లి వస్తానంటూ వెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి రాలేదు.
శనివారం సాయంత్రం సమయంలో గ్రాండ్ ఐలాండ్ రహదారి మీద ప్రసాద్ వేగంగా నడుస్తూ వెళ్లటం చూశామని చుట్టుపక్కల నివసిస్తున్న వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ప్రసాద్ ఆచూకీ కోసం మూడురోజులుగా పోలీసులు, బంధువులు గాలిస్తున్నా ఫలితం దక్కలేదు.
తన తండ్రి నెలక్రితం భారత్ నుంచి వచ్చారని, ఇంటి మీద బెంగతో కొంత విచారంగా ఉంటున్నారని దుర్గ తెలిపారు. నాలుగు రోజుల పాటు అన్ని చోట్ల అతని కోసం గాలించారు. చివరకు పోలీసులు చేతులెత్తేశారు. అతడి మిస్సింగ్ క్లూ కూడా లభించలేదని పోలీసులు చెప్పారు.