ఇమ్రాన్ఖాన్! ముసుగు తొలగించు, దేవాలయాల్లో గంటలు మోగుతాయి.. ఇదే భారత్: అసదుద్దీన్ హెచ్చరిక
హైదరాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో మజ్లిస్ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై నిప్పులు చెరిగారు. పాక్ ప్రధాని అమాయకత్వపు ముసుగు తీసేయాలని హెచ్చరించారు. జమాత్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులు దెయ్యానికి శిష్యులు అని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే పుల్వామా దాడి జరిగిందని విమర్శలు గుప్పించారు. శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడారు.
ఇమ్రాన్ ఖాన్! ఇదే మొదటిది కాదు.. నీ ముసుగు తీసెయ్
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు తాము ఒక్కటే చెప్పదలుచుకున్నామని, టీవీ కెమెరాల ముందు కూర్చోని భారత్కు నీతి వ్యాఖ్యలు బోధించడం కాదని, ఇది తొలి ఘటన కాదని, గతంలో పఠాన్కోట, యూరి ఘటనలో జరిగాయని అసదుద్దీన్ గుర్తు చేశారు. ఇప్పుడు పుల్వామా దాడి జరిగిందని, ముందు నీ అమాయకత్వపు ముసుగులు తొలగించు అని ఇమ్రాన్ ఖాన్ను హెచ్చరించారు.
భారత్లోని ముస్లీంల గురించి నీకవసరం లేదు
పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్లోనే ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇప్పటికైనా ఇమ్రాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. భారతదేశంలోని ముస్లింల గురించి పాకిస్తాన్ ఆలోచించాల్సిన పని లేదని చెప్పారు. 1947లోనే భారత్ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారని తెలిపారు. అందుకే నాడు జిన్నా ప్రతిపాదనను ఇక్కడి ముస్లీంలు తిరస్కరించారని చెప్పారు. భారత్లో ఉన్న ముస్లింలపై పాకిస్తాన్ చింతించాల్సిన అవసరంలేదని, భారత్ ఐక్యతను పాకిస్తాన్ ఓర్చుకోలేకపోతోందని చెప్పారు.
మానవత్వంపై దాడి చేస్తున్నారు
నలభై మందికి పైగా వీర జవాన్లను పొట్టన బెట్టుకున్న మీది జైష్ ఏ మొహమ్మద్ సంస్థ కాదని, సైతాన్ అని అసదుద్దీన్ అన్నారు. మసూద్ అజహర్ మౌలానా కాదని, దెయ్యం అన్నారు. లష్కరే తోయిబా కూడా లష్కరే సైతాన్ అన్నారు. ఉగ్రవాద దాడుల ద్వారా మానవత్వంపై దాడులు చేస్తున్నారన్నారు.
దేవాలయాల్లో గంటలు మోగుతాయి
భారత్లోని దేవాలయాల్లో గంటలు మోగనివ్వమని పాకిస్తాన్కు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మీకు(పాకిస్తాన్) భారత్కు గురించి తెలియదని, భారత్లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్, దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయని చెప్పారు. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారని, దీనిని పాకిస్తాన్ ఓర్వలేకపోతోందన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్ఐ కలిసే పుల్వామా దాడిని జరిపాయన్నారు. ఓ మహ్మద్ ఎప్పుడు కూడా వ్యక్తి ప్రాణాల్ని బలి తీసుకోడన్నారు. అలాగే దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందని చెప్పారు.