ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి - ప్రభుత్వానికి కుటుంబీకుల విజ్ఞప్తి
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన ఓ తెలుగు విద్యార్థి అనుమానస్పదరీతిలో మరణించాడు. ఆస్ట్రేలియాలోని సదరన్ క్రాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోన్న హరిశివశంకర్ రెడ్డి తోటి విద్యార్థులతో కలిసి ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నాడు. బాత్ రూమ్ కు వెళ్లిన ఆ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన రూమ్ మేట్స్ అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా నుంచి సమాచారం అందినట్లు వికారాబాద్ జిల్లాలోని అతని తల్లిదండ్రులు తెలిపారు.
సుమేధా మృతితో కదిలిన సర్కార్ - అంతటా ఓపెన్ నాలాల మూసివేత - కేటీఆర్ కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం హరిదాస్ పల్లికి చెందిన సాయి రెడ్డి, నాగేంద్రమ్మ దపంతులకు ఒక్కగానొక్క కొడుకు హరిశివశంకర్ రెడ్డి. పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతను అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సదరన్ క్రాస్ యూనివర్సిటీలో తనతో కలిసి చదువుతోన్న స్నేహితులతో హరి కలిసి ఉంటుననాడని, బాత్ రూమ్ లో పడిపోయిన తర్వాత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని స్నేహితుల ద్వారా తెలిసినట్లు కుటుంబీకులు వెల్లడించారు.
కరోనా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో హరిశివశంకర్ రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సాయం చేయాలని, ఒక్కగానొక్క కొడుకును చివరిసారైనా చూసుకునే అవకాశం కల్పించాలని కుటుంబీకులతోపాటు హరిదాస్ పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.