కాలిఫోర్నియాలో కాల్పులు: తెలంగాణ విద్యార్థికి తీవ్రగాయాలు
ముబీన్ అహ్మద్(26) అనే విద్యార్థి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ షాపులో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలోని కాలిఫోర్నియాలో దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ముబీన్ అహ్మద్(26) అనే విద్యార్థి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ షాపులో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.
జూన్ 4న సాయంత్రం 6గంటల ప్రాంతంలో షాపులో ఉన్నప్పుడే ముబీన్పై కాల్పులు జరగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జూన్ 5న ముబీన్ కుటుంబసభ్యులకు ఘటనపై సమాచారం ఇచ్చారు.
'తన కుమారుడు తీవ్రగాయాలతో ఐసీయూలో ఉన్నాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే, మేం అక్కడికి వెళ్లేందుకు మాకు వీసా కావాలి' అని సంగారెడ్డిలోని ముబీన్ తండ్రి ముజిబ్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి హరీశ్ రావును సాయం కోరినట్లు ఆయన చెప్పారు.
2015, ఫిబ్రవరిలో ముబీన్ కాలిఫోర్నియా వెళ్లాడని ముజిబ్ తెలిపారు. కాగా, ముబీన్ కుటుంబానికి అవసరమైన సాయం చేయాలని ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్.. విదేశాంగశాఖ మంత్రి సుస్మా స్వరాజ్, తెలంగాణ మంత్రి కేటీ రామారావుకు లేఖ రాశారు.