సాంకేతిక లోపం: శంషాబాద్లో ఇండిగో ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్: ఏపీ స్పీకర్, ఆనం సహా 68మంది క్షేమం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం ఓ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం రావడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు.
సుమారు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం.. విమానాశ్రయం నుంచి క్లియరెన్స్ రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు పైలట్. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా కిందకు దిగారు.
కాగా, ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తోపాటు 68మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో చక్కర్లు కొట్టిన సమయంలో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
క్షేమంగా విమానం ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులంతా తిరుపతికి వెళ్లారు. అయితే, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం నెలకొందే అధికారులు వెల్లడించలేదు.