శంషాబాద్: పేలిన ఇండిగో విమానం టైరు, మంటలు, విమానంలోనే రోజా
Recommended Video
హైదరాబాద్: శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఇండిగో విమానం ముందు టైరు పేలింది. గమనించిన పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన సిబ్బంది
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ విమానంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.
ప్రయాణికుల ఆందోళన
ఒక్కసారిగా మంటలు రావడం, రెండు గంటలపాటు విమాన డోర్లు తెరుచుకోకపోవడంతో విమానంలోని 120మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో విమానం దిగొద్దని ప్రయాణికులకు విమాన సిబ్బంది తెలిపారు.
నగరి నుంచి రోజా
విమాన సిబ్బందితో ఆందోళనలో ఉన్న ప్రయాణికులు కాసేపు వాగ్వాదానికి దిగారు. అయితే, సరైన సమయంలో మంటలు ఆర్పేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన రోజా.. ఆ తర్వాత హైదరాబాద్కు ఈ విమానంలో వచ్చారు.
తాను ఆందోళన చెందా: రోజా
కాగా, మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత ప్రయాణికులను విమాన సిబ్బంది సురక్షితంగా కిందికి దించారు. ప్రమాద ఘటనతో తాను కూడా ఆందోళన చెందానని, విమాన సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని రోజా తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.