పిచ్చి రాతలు మానుకో!: రాధాకృష్ణపై ఇంద్రకరణ్
ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు మంత్రులపై రోజుకో రీతిలో ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ అబద్ధాలు రాస్తున్నారని తెలంగాణ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. పిచ్చిరాతలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
నిర్మల్లో తన కుటుంబసభ్యులు చెరువులు ఆక్రమించారని, ఇతర వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నామంటూ ఆధారాలు లేకుండా అసత్యాలు రాస్తున్నారని, రాధాకృష్ణ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం నిత్యం బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులతో, ఆంధ్రలో ఆయన ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలకు ఆశపడి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహించారు. ఇదంతా బాబు కుట్రలో భాగమేనని ఆరోపించారు.
అక్రమాలు నిరూపిస్తే ఆస్తులు ఆంధ్రజ్యోతికి రాసిస్తానని సవాల్ విసిరారు. మీడియాపై గౌరవం ఉన్నదని, నిజంగా తప్పులు చేస్తే దిక్సూచిలా సరిదిద్దాలే తప్ప, స్వప్రయోజనాల కోసం అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్నారు.
ఇప్పటికే అనేక అసత్యపు రాతలు రాసిన ఆ పత్రికపై న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయంలో కోర్టును సైతం ఆశ్రయించామన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే ఆంధ్ర మీడియా పచ్చకామెర్ల కండ్లతో చూస్తున్నదని చురకలంటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ముమ్మాటికీ విహారయాత్రేనన్నారు. యాత్రను జిల్లా రైతులే అడ్డుకుంటారన్నారు. నాలుగేళ్లలో గృహనిర్మాణశాఖను ప్రక్షాళన చేసి అవినీతికి తావులేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి తీరుతామన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయకు అన్నివర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని, ఆంధ్రా పత్రికలు అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోబోమని అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. మంగళవారం నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట ఊర చెరువు పనులను అంచనాల కమిటీ పరిశీలించింది.
ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడారు. మిషన్ కాకతీయలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్ని సీమాంధ్ర పత్రికలు అవాస్తవాలను రాస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
వాస్తవాలను గ్రహించి ప్రజాప్రయోజనాల పనులకు సహకరించాలని, యాజమాన్యాలు మైండ్ సెట్ను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు సైతం మిషన్ కాకతీయను ఆహ్వానించినా, ఆంధ్రాపత్రికలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అసత్యాలను ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.