బక్క మనిషే కానీ..: కెసిఆర్పై ఇంద్రకరణ్, మా నిధులు ఎపికి: తుమ్మల
హైదరాబాద్/ న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖఱ రావు బక్కపలుచని మనిషైనా కొన్నింటిలో బలమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఇంద్రరణ్ రెడ్డి అన్నారు. గతంలో పుష్కరాలు అంటే రాజమండ్రి అనే భ్రమను తొలగించామని వారు సోమవారం మీడియాతో అన్నారు. ఇదే అనుభవంతో రానున్న సమ్మక్క సారలక్క జాతరను, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని వారు చెప్పారు.
అందరి సహకారంతో తెలంగాణలో గోదావరి పుష్కరాలను విజయవంతంగా ముగించామని వారు చెప్పారు. పుష్కరాలను విజయవంతం చేసిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో కలెక్టర్లు బాగా పనిచేశారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
పుష్కరాల ముగింపుపై మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నాయిని మీడియాతో మాట్లాడారు. ఏ ఘాట్లోనూ నీటి కొరత లేకుండా చూశామని ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. పుష్కర భక్తులకు అన్నదానం, మంచినీరు పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించామని, 20 వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పించామన్నారు. బాగా పనిచేసిన వారందరికీ నాయిని అభినందనలు తెలిపారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు రావాల్సిన శిశు సంక్షేమ శాఖ నిధులు ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నాయంటూ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీని కలిసి ఫిర్యాదు చేశారు. తుమ్మల సోమవారం ఢిల్లీలో మేనకగాంధీని కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సఖీ స్కీంలో షీటీమ్లకు భవనాలను నిర్మించాలని మంత్రిని కోరానని స్థలాలు కేటాయిస్తే భవనాలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తుమ్మల తెలిపారు.