తెలంగాణలో ఆ స్థానంపై బాలకృష్ణ సూచన, చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారా?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం సహా ఇతర పార్టీల కూటమి దాదాపు ఖరారైంది. టిక్కెట్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీడీపీకి 15 నుంచి 20 సీట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి బలం ఉన్నచోట ఇవ్వనున్నారు. టీడీపీ మాత్రం 30కి పైగా స్థానాలు కోరుతోంది.
చంద్రబాబు నాయుడు కూడా దృష్టి
ఇదిలా ఉండగా తెలంగాణలో తమకు వచ్చే స్థానాలు, వాటిల్లో పోటీ చేయించే అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా దృష్టి సారించారు. టీడీపీ కంచుకోటలకు టిక్కెట్లు రానున్న నేపథ్యంలో ఆయా స్థానాల్లో పలువురు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో వర్కవుట్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు.
టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఈసారి కూడా సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన లేదా కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండటంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే విధమైన అభ్యర్థులపై చంద్రబాబు దృష్టి సారించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి దాదాపు ఖరారు
ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి దాదాపు ఓ అభ్యర్థిని ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ సరైన నేతను బరిలోకి దింపి మళ్లీ గెలవాలని చూస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పలువురు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈసారి భవ్య క్రియేషన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
బాలకృష్ణ ఆయన పేరును సూచించారనే ప్రచారం
రేసులో ఆయన కూడా ముందంజలో ఉన్నారని చెబుతున్నారు. పార్టీకి ఆయన పలుమార్లు సహాయ, సహకారాలు అందించారు. పైగా వివాదరహితుడు, సౌమ్యుడు అనే పేరు ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన పేరును సూచించారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు కూడా ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పారట. దీంతో ఆయనకు సీటు ఖరారైందనే ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ ఇక్కడ ప్రచారం కూడా చేయనున్నారని తెలుస్తోంది.
{document1}