డికె అరుణ, సోలిపేట మధ్య ఆసక్తికరం:అక్కా మా అభ్యర్థికి ఓటేయండి, తెలంగాణ కోసం త్యాగం
హైదరాబాద్:రాజ్యసభ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు మొట్టమొదటి ఓటును వినియోగించుకొన్నారు. మరోవైపు తమ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణను కోరారు
Recommended Video
తెలంగాణ భవన్ నుండి ప్రత్యేకమైన బస్సుల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం నాడే మాక్ పోలింగ్లో వివరించారు.
తెలంగాణ భవన్ నుండి వచ్చిన మంత్రి హరీష్ రావు తొలి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి రెండో ఓటు వేశారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఏజంట్లుగా రమేష్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, రాజేష్, గట్టు రామచంద్రరావులు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఏజంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డిలు వ్యవహరించారు.
అక్కా మా అభ్యర్ధికి ఓటు వేయండి
అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పీ కార్యాలయంలోకి వెళ్తున్న మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శుక్రవారం నాడు ఉదయాన్నే ఎదురుపడ్డారు.అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డికె అరుణకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.
అక్కా మా పార్టీ అభ్యర్ధి బండ ప్రకాష్కు ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ను కోరారు. అయితే తెలంగాణ సాధన కోసం మా అభ్యర్ధి బలరాం నాయక్ పదవిని పోగొట్టుకొన్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ గుర్తు చేశారు. అలాంటి అభ్యర్ధిని కాదని మీ అభ్యర్ధికి ఎలా ఓటేస్తామని డికె అరుణ సోలిపేట రామలింగారెడ్డికి ధీటుగా బదులిచ్చారు.