ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచి.. చిత్ర హింసలు పెడుతూ..వృద్ధాశ్రమం పేరుతో అమానుషం
వారంతా వృద్ధులు.. అమ్మా బాగున్నావా , ఎలా ఉన్నారు అని పలకరిస్తే చాలు సంతోషంతో పొంగిపోయే పెద్దలు. కడుపున పుట్టిన బిడ్డలు తమకు బరువయ్యారని, చెప్పిన మాట వినటం లేదని , భారంగా భావించి వృద్దాశ్రమాల్లో పడేస్తే అక్కడ జరుగుతున్న అమానుష ఘటనలతో విలవిలలాడుతున్నారు . తాజగా అలాంటి అమానుష ఘటనే హైదరాబాద్ నగర శివారులోని నాగారం శిల్పానగర్లో వెలుగులోకి వచ్చింది.
మానసిక పునరావాస కేంద్రం అంటూ ఓ వృద్ధాశ్రమ నిర్వాకం
వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా నిర్వహిస్తున్న మానసిక పునరావాస కేంద్రంలో వయసు పైబడిన వారిని కట్టేసి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచుతూ, వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే విషయాన్ని స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక దీంతో పోలీసులు పునరావాస కేంద్రంపై దాడి చేసి అక్కడ పరిస్థితులను అక్కడ ఉన్న వృద్ధులను అడిగి తెలుసుకున్నారు.
లక్షల్లో డబ్బులు వసూలు చేసి మరీ చిత్రహింసలు పెడుతున్న నిర్వాహకులు
ఆశ్రమంలో ఉన్న బాధితుల నుంచి వివరాలు సేకరించిన వారికి ఆశ్రమం గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానసికంగా బాధపడేవారిని బాగుచేస్తామంటూ చెప్పుకునే సదరు వృద్ధాశ్రమ నిర్వాహకులు చాలా మంది పిల్లల వద్ద నుండి తమ తల్లిదనృలను బాగు చేస్తామని రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు బాధితులను గొలుసులతో కట్టేసి, వారికి నరకయాతన చూపిస్తున్నట్లు వెల్లడైంది. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న ఆశ్రమాలు
ఇలాంటి ఆశ్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. కేవలం ఫండ్స్ కోసం ఆశ్రమాలు ప్రారంభించటం , అందులో పునరావాసం పొందే వారి ఆలనా పాలనా గాలికి వదిలేసి అందిన కాడికి దండుకుంటున్న గ్యాంగ్ లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఇలాంటి సంస్థలపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. వృద్దాశ్రమాల్లోనే కాదు చిన్నారుల పునరావాస కేంద్రాలలోనూ వేధింపులు, చిత్రహింసలు కొనసాగుతున్నాయి. స్వచ్చంద సంస్థలు, ఆశ్రమాల మాటున దోపిడీకి పాల్పడుతున్నారు . ఇలాంటి ఆశ్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.