జగన్! వైయస్ అన్యాయం చేశారు, 2004లో బాబు వల్లే గెలిచాం: విహెచ్, పవన్ కళ్యాణ్పై..
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆదివారం నాడు ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులు కట్టి నష్టం కలిగించారని ఆయన భగ్గుమన్నారు.
ఆయన తనయుడు, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాలమూరు, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పీ జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) పోరాడితే ఆయనను వైయస్ రాజకీయంగా, మానసికంగా హింసించారన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆరోపించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్లు అదే బాటలో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. 2004లో చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, వైయస్ వల్ల కాదన్నారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల గురించి వాస్తవాలు తెలుసుకుని జగన్ మాట్లాడాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్టు నుంచి వైయస్ నీళ్లు తీసుకెళ్లిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం కలుగుతుందని జగన్ మాట్లాడడం సరికాదన్నారు.
ఏపీకి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించిందని, బిజెపియే అమలు చేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ పైన అభాండాలు వేయడం మానుకోవాలన్నారు.