మధ్య వేలుపై ఓటరుకు సిరా చుక్క! .. అదేంటి చూపుడు వేలుపై కదా అంటారా!
హైదరాబాద్ : సాధారణంగా ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఎడమ చేతి చూపుడువేలుపై సిరా గుర్తు పెడతారు. తెలంగాణలో త్వరలో జరగున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం ఓటరుకు ఇంకుమార్కును మధ్య వేలుకు పెట్టనున్నారు. అదేంటి చూపుడు వేలికి కాకుండా మధ్య వేలుకు ఎందుకు పెడతారు? అని డౌట్ రావడం సహజమే. అయితే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది.
గప్పుడు గట్ల..! గిప్పుడు గిట్ల..! సీఎం వైఖరితో ముందుకుపోయేది ఎట్ల..?
చెరగని సిరా గుర్తు
తెలంగాణలో ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. అయితే ఎన్నికలు ముగిసి కొన్ని రోజులే కావడంతో ఇంకు గుర్తు ఇంకా చెరిగిపోలేదు. మరో 15 రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికల్లా సిరా గుర్తు పూర్తిగా చెరిగిపోయే అవకాశం తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ చూపుడు వేలుకు పెడితే ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు మార్కు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 20న షెడ్యూల్
తెలంగాణలో 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈ నెల 20న షెడ్యూల్ విడుదల కానుంది. మూడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో మే 6, మే 10, మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మరో 25 రోజుల్లోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశమున్నందున సిరా గుర్తు విషయంలో ఛాన్స్ తీసుకోవద్దని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది.
పంచాయితీ ఎన్నికల్లో
తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లోను ఓటర్లకు ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు పెట్టారు. 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పంచాయితీ పోలింగ్ నాటికి సిరా గుర్తు పూర్తిగా చెరగకపోవడంతో మధ్య వేలికి సిరా చుక్క పెట్టారు.