లాక్ డౌన్ అమలుపై కేంద్రం ఆరా..! తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..!!
ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావాన్ని టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు అమలు చేస్తున్నాయన్న అంశం పట్ల కేంద్రం ఫోకస్ పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రాల ప్రణాళిక ఏవిధంగా ఉందనే అంశాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రాలకు కేంద్ర బృందాలు.. కరోనా కట్టడికి రాష్ట్రాల కార్యాచరణ తెలుసుకోనున్న కేంద్రం..
ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు తీరు తెన్నులు, ఉల్లంఘనలు ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలపై ఓ అంచనాకు వచ్చేందుకు మరి కొన్ని రాష్ట్రాలకు కేంద్ర బృందాలు పర్యవేక్షించనున్నాయి. ముఖ్యంగా ప్రమాదకర జోన్లలో ఆంక్షలు ఏవిధంగా అమలవుతున్నాయి, ప్రజా సౌకర్యాలు తదితర అంశాలను కేంద్ర బృందం తెలుసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
ఆందోళన కలిగిస్తున్న కేసుల సంఖ్య.. రాష్ట్రాల తీరుతెన్నులపై కేంద్రం ఫోకస్..
తెలంగాణాలో హైదరాబాద్, గుజరాత్ లో అహ్మదాబాద్, సూరత్, మహారాష్ట్రలో థానే, తమిళనాడులో చెన్నై నగరాలను ఈ బృందాలు సందర్శించనున్నాయి. మేజర్ హాట్ స్పాట్ జిల్లాలను కేంద్రం ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు అంతర్రాష్ట్ర మంత్రివర్గ బృందాలను పంపుతున్నామని హోం శాఖ ట్వీట్ చేసింది. రాష్ట్ర అధికారులకు వీరు తగిన ఆదేశాలు జారీ చేస్తారని, తమ నివేదికలను కేంద్రానికి సమర్పిస్తారని ఈ శాఖ పేర్కొంది. లాక్ డౌన్ అమలుతో పాటు ప్రజా సమస్యలపై కేంద్ర బృందం దృష్టి పెట్టనుంది.
ప్రత్యక్షంగా పరిస్థితులు తెలుసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వ వినూత్న ప్రయత్నం..
అంతే కాకుండా నిత్యావసర వస్తువుల సరఫరా, సామాజిక దూరం పాటింపు నిబంధనలు, వైద్యులు, హెల్త్ వర్కర్ల భద్రత, పేదలకు, కూలీలకు సహాయ శిబిరాల ఏర్పాటు వంటి అన్ని అంశాలను ఈ బృందాలు పరిశీలించనున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా కేంద్ర బృందాలను హోమ్ శాఖ పంపింది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికి కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర పరిస్థితులపై నివేదిక.. కీలర నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..
కరోనా పాజిటీవ్ కేసులు తగ్గినట్టే తగ్గుతూ అకస్మాత్తుగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతే కాకుండా కరోనా వైరస్ ఇప్పట్టో విడిచిపెట్టదనే వార్తలు ఘుప్పుమంటుండడంతో కేంద్రం మరింత అప్రమత్తంగా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల ప్రాణాలకన్నా ముఖ్యం ఏదీ కాదని, కరోనా పూర్తిగా కట్టడికాక పోతే మరిన్ని రోజులు స్వీయ నియంత్రణ అవసరమనే అంశాన్ని రాష్ట్రాల్లో పర్యటించబోయే బృందాలు కేంద్రానికి వవిరించబోతున్నాయి. ఈ బృందాలు సమర్పించే నివేదిక ప్రకారం లాక్ డౌన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.