మోడీ నిర్ణయంపై మేధావులేమంటున్నారు?: నిర్ణయం సరైందేనా! (ఫోటోలు)
హైదరాబాద్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. రూ.500,రూ.1000నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అటు సామాన్యుల్లోను, ఇటు మీడియాలోను ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరికి నష్టం? ఎవరికి లాభం? వంటి లెక్కలను బేరీజు వేస్తూ.. ఎవరి విశ్లేషణల్లో వారు మునిగిపోయారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్య జనాలను ఇబ్బందిపెట్టేదిగా మారింది తప్పితే.. దీనివల్ల నల్లధనం బయటికొచ్చే అవకాశం లేదని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. దీర్ఘ కాలంలో దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉండవచ్చుననేది మరికొందరి వాదన. ఇలాంటి అనేకానేక గందరగోళ అభిప్రాయపడాల నడుమ.. పలువురు మేధావులను, సామాజికవేత్తలను కేంద్రం నిర్ణయంపై స్పందించమని కోరగా.. వారంతా ఆసక్తికర సమాధానాలు వ్యక్తపరిచారు.
కొంతలో కొంత ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో నల్లధనం అంతా వైట్ మనీగా మారిపోతుంది. మనం గమనించాల్సిందేంటంటే.. దేశంలో నల్లధనం నిలువలు ఎక్కువగా స్థిరాస్థి రంగాలైనా.. రియల్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్, ఇతరత్రా రంగాల్లో పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. వాటి పరిస్థితేంటి?
కాబట్టి.. బ్లాక్ మనీ కలిగివున్న బడా బాబులకు ఒకరకంగా ఇది కేంద్రం ఇచ్చిన బంపర్ ఆఫర్ లాంటిదే. కేంద్రం నిర్ణయం వల్ల బడా పెట్టుబడిదారులు మరింత బలవంతులుగా తయారవుతారు. భవిష్యత్తులో మరింతగా వారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించడం ఖాయం.
రూ.2వేల నోటు ప్రవేశం వల్ల.. లంచాధికారుల అవినీతి మరింతగా పెరిగే అవకాశముంది కదా! అని ప్రముఖ ఇంటలెక్చువల్ సురేంద్ర రాజును ప్రశ్నించగా.. వాస్తవమే కదా.. అంటూ సమాధానం చెప్పారాయన.
అధికారంలోకి రాకముందు విదేశాల్లో పోగుబడ్డ నల్లధనం నిలువలను దేశానికి రప్పించి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తానని చెప్పిన మోడీ.. ఆ పనిలో విఫలమై.. ఇప్పుడు దీన్ని కప్పి పుచ్చుకోవడానికి, కేవలం సంచలనాల మార్కుతో కూడినటువంటి పాలనను కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్పితే.. దీనివల్ల బ్లాక్ మనీ బయటపడుతుందనేది భ్రమ మాత్రమే.
నల్లధనం పునాదుల మీదనే మోడీ అధికారంలోకి వచ్చారు.. కొనసాగుతున్నారు.. అన్న విషయాన్ని మరిచిపోరాదు. దేశంలో నల్లధనం నిలువలన్నీ కరెన్సీ రూపంలో ఉండే అవకాశం తక్కువ. చాలామంది బడాబాబులు, పారిశ్రామికవేత్తలు.. ఆ డబ్బునంతా బంగారం కొనుగోళ్లకో, స్థిరాస్థి పెట్టుబడులకో వెచ్చించి ఉంటారు. మరలాంటప్పుడు.. ఈ నల్లధనాన్ని ఎలా రికవర్ చేస్తారు?
చదువురాని, పేద గ్రామీణ ప్రజలకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరం. రూ.2వేల నోటును ప్రవేశపెట్టే బదులు.. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే రూ.10,రూ.20,రూ.100నోట్లనే కేంద్రం ఎక్కువ సంఖ్యలో ముద్రిస్తే మంచిదని సీతారాములు అభిప్రాయపడ్డారు.
బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసే ప్రధాని మోడీ..వారికి సమాచారం ఇవ్వకుండానైతే ఈ నిర్ణయం తీసుకుని ఉండరు.కాబట్టి.. వారిని మినహాయించి, మిగతావాళ్లే ఆయన టార్గెట్ గా కనబడుతోంది. అయితే కాస్త వేచి చూసే ధోరణిని అవలంభిస్తే.. దీనివల్ల దీర్ఘకాలంలో ఏమైనా ప్రయోజనాలు ఉండవచ్చునేమో అన్నదానిపై స్పష్టత వస్తుంది.
అయితే కేంద్రం నిర్ణయం సామాన్య ప్రజలను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టేసిందని ప్రముఖ ముస్లిం సామాజికవేత్త స్కైబాబా అభిప్రాయపడ్డారు.