కాంగ్రెస్ పెద్దలకు "బుల్లెట్" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ల టైములో వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. ఈమేరకు వారిద్దరికీ ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరి బకాయిలు కలిపి 9 లక్షల రూపాయలున్నట్లు అందులో పేర్కొన్నారు.
బుల్లెట్ ప్రూఫ్ లెక్కలు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులివ్వడం చర్చానీయాంశమైంది. ఎలక్షన్ల సమయంలో ప్రతిపక్ష నేతలకు భద్రత కోసం ప్రభుత్వం సమకూర్చే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు అద్దె చెల్లించాలనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రోజువారీ కిరాయి, డ్రైవర్ భత్యం కలిపి ఈ ఇద్దరు నేతలు 9 లక్షల రూపాయలు చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. ఈమేరకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పేరున గాంధీభవన్ కు నోటీసులు పంపించారు ఇంటెలిజెన్స్ ఐజీ.
కిలోమీటర్ 37/-.. డ్రైవర్ భత్యం 100
అసెంబ్లీ రద్దైన రోజు (సెప్టెంబర్ 6) నుంచి డిసెంబర్ 7 వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు ( TS 09 PA 1653, TS 09 PA 1654) సంబంధించి 9 లక్షల 860 రూపాయలు చెల్లించాల్సిందిగా ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జానారెడ్డి 11,152 కిలోమీటర్ల మేర బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగించుకోవడంతో 4 లక్షల 20వేల 924 రూపాయలు.. అలాగే షబ్బీర్ అలీ 12,728 కిలోమీటర్ల మేర ప్రయాణించడంతో 4 లక్షల 79 వేల 936 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కిలోమీటర్ కు 37 రూపాయల చొప్పున.. డ్రైవర్ రోజువారీ భత్యం 100 రూపాయలుగా ఛార్జీ విధించారు.
కక్ష సాధింపు కాదు.. ఎన్నికల కోడ్
మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఢీ అంటే ఢీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక రకంగా గులాబీవనానికి చెక్ పెట్టేలా వ్యూహారచన చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అదలావుంటే టీడీపీతో పొత్తుపెట్టుకోవడంపై కారు రథసారథి కేసీఆర్.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారపర్వంలో చేయి గుర్తు లీడర్లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ లో అభివృద్ధిపై దృష్టి పెట్టానని.. రెండో టర్మ్ ప్రభుత్వంలోకి వస్తే కాంగ్రెస్ అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానంటూ కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అందులోభాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ తో కారులోకి ఎక్కిస్తున్నారనే వాదనలున్నాయి. తాజాగా జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులివ్వడం కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచారపర్వం నాటి మాటలు గుర్తుకుతెస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డికి, శాసనమండలి విపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీకి భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చాల్సి ఉంటుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలయినందున.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నది ఎవరైనా సరే అద్దె చెల్లించాలనేది ఆదేశాల్లో ఉందంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. అధికార పార్టీ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.