ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగిన రేవంత్ రెడ్డి.. రణరంగంగా మారిన ఇంటర్ బోర్డ్ పరిసరాలు..!
Recommended Video
హైదరాబాద్: ప్రశాంతంగా ఉండే ఇంటర్ బోర్డ్ రణరంగంగా మారింది. తల్లిదండ్రుల నిరశనలతో దద్దరిల్లింది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, విద్యార్థుల తల్లి తండ్రులను కనీసం బోర్డు కార్యాలయం లోకి కూడా ఆహ్వానించకపోవడం సోచనీయమని టీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తల్లి తండ్రులకు ఇంటర్ అధికారులు సమాధానం చెప్పాలని, ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించలేదని రేవంత్ ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరపాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డ్ వద్ద బైఠాయించిన రేవంత్ రెడ్డిని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇంటర్ బోర్డ్ వద్ద యుద్ద వాతావరణం..! ప్రభుత్వం పై తల్లిదండ్రుల అసహనం..!!
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా చేయడంతో నాంపల్లి లోని బోర్డు కార్యాలయం ముందు గందరగోళంగా తయారైంది. పేపర్ రీ వాల్యుయేషన్ కు వేయి రూపాయలు చెల్లిస్తామన్నా బోర్డు ఒప్పుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు.
ఇంటర్ బోర్డు తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..! తల్లి దండ్రులకు బాసటగా నిలిచిన వర్కింగ్ ప్రసిడెంట్..!!
తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల మార్కుల జాబితాలో అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఫలితాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
రేవంత్ రెడ్డిని చూసి రెచ్చిపోయిన విద్యార్థులు..! బోర్డ్ లోపలకు చొచ్చుకుపోయే ప్రయత్నం..!!
విద్యార్థుల మార్కుల జాబితాలో వస్తున్న ఆరోపణలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై టీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మార్కులు అధికంగా రావడంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రయివేటు కళాశాలలో చదువుతున్న 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఫెయిల్ అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
రేవంత్ అరెస్టు..! బేగం బాజార్ పీయస్ కు తరలింపు..!!
విద్యార్థులకు సంఘీభావంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని బైఠాయించారు. పేపర్ వాల్యుయేషన్, తప్పిదాలకు సీఎం చంద్రశేఖర్ రావు, విద్యాశాఖ మంత్రి జీ.జగదీష్ రెడ్డి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. బొర్డు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆయనను అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు.