నరేశ్ ఎక్కడ?, స్వాతిని ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టారు: హైకోర్టు సీరియస్
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కుమారుడు కనిపించడం లేదని, అతని ఆచూకీ కనిపెట్టాలంటూ నరేష్ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది.
నరేష్ అదృశ్యం, అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్1లోగా నరేష్ జాడ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించింది. లేదంటే ఉన్నతాధికారితో విచారణ జరపించి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే అతడిని వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది.
రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని కూడా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేగాకుండా గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతిని ఆమె తండ్రి.. ఒంటరిగా ఎందుకు వదిలి పెట్టారని నిలదీసింది. దీనిపై ప్రభుత్వ లాయర్ శరత్ సమాధానమిస్తూ... నరేష్ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అతని కాల్ డేటాను కూడా పరిశీలించామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఈ కేసుపై భువనగిరి డీసీపీ యాదగిరి మాట్లాడుతూ... పోస్ట్మార్టం నివేదికలో స్వాతిది ఆత్మహత్యగానే తేలిందన్నారు. వరకట్న వేధింపుల వల్లే స్వాతి తమ ఇంటికి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని, అలాగే నరేష్ ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. స్వాతి తండ్రిని కూడా విచారణ జరుపుతున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని తెలిపారు.
అంతకుముందు జరిగిన పరిణామాలు గమనించినట్లయితే.. మృతురాలు స్వాతికి మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్తో ఫేస్బుక్ ద్వారా రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. నరేష్ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్బుక్లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు.
నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచించారు. అయినా నరేష్-స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డి చెప్పాడు. దీంతో మే 11న తిరిగి భువనగిరికి వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్రెడ్డి తన కూతురును తన వెంట తీసుకెళ్లాడు.
కాగా, అప్పటి నుంచి అంబోజు నరేష్ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీల ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, నరేశ్ అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.