25 నుంచి ఇంటర్ పరీక్షలు: గంట ముందొచ్చినా అనుమతిస్తామన్న సబితా ఇంద్రారెడ్డి, కోర్టులో పిటిషన్
హైదరాబాద్: కరోనా నిబంధనలు పాటిస్తూనే అక్టోబర్ 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పస్టం చేశారు. కరోనావైరస్ మహమ్మారి పరిస్థితుల వల్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో ఏడాదికి ప్రమోట్ చేశామని, అయితే, పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ముందే చెప్పామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్ష్ల 58వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాలను 1400 నుంచి 1750కి పెంచినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరీక్షల నేపథ్యంలో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్నాయి. గతంలో పరీక్షలు లేకుండా ప్రమోట్ అయిన విద్యార్థులు ఇప్పుడు రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబలో ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం కోత విధించింది. దీంతో 70 శాతం సిలబస్తోనే పరీక్షలు జరుగుతాయి.
ఇది ఇలావుంటే, తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రుల సంఘం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని పిటిషనర్ కోర్టును కోరారు. పరీక్షలు రద్దు చేసి పాస్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.