అబ్బాయితో కాలేజీకి వెళ్తుంటే చాటుగా ఫోటోలు తీసి...: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఆలేరు: యువకుడితో మాట్లాడినందుకు, కలిసి కాలేజీకి వెళ్లినందుకు అవమానించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలోని కొల్లూరులో జరిగింది. ఆకతాయిల వేధింపుకు ఓ నిండు జీవితం బలైంది.
మృతురాలి పేరు కావ్య. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని. ఈమె ఓ యువకుడితో మాట్లాడుతుండగా, కాలేజీకి వెళ్తుండగా కొందరు చాటుగా ఫోటోలు తీశారు. వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారు. దీనిపై అందరితో పాటు తల్లిదండ్రులు కూడా మందలించారు.
తాను క్యాజువల్గా మాట్లాడితే ఇష్యూ చేశారని, తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెందింది. దీంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమె ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కాలేజీకి తన స్నేహితుడు శేషుతో కలిసి అప్పుడప్పడు వెళ్లేంది. వీరు కలిసి వెళ్తున్న సమయంలో ఫోటోలు తీసిన పవన్ అనే యువకుడు వాటిని స్నేహితులకు, మరికొంతమందికి పంపించి, పుకార్లు పుట్టించాడు.
దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. నిందితుడిని పెద్దలు మందలించారు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. దీంతో ఆమె మనస్తాపంతో పురుగుల మందు తాగింది. తొలుత ఆలేరు ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాదులోని గాంధీకి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ను, మరికొందరిపై కేసు నమోదు చేశారు.