ఇంటర్ ఫలితాల అవకతవకలు ... కేటీఆర్ ఆ పని చెయ్యటం వల్లే ఇదంతా జరిగిందా ?
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయినట్టు రావటంతో మనస్తాపం చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు 18 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఒక పక్క బాలల హక్కుల కమీషన్ కూడా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విద్యార్థులకు బోర్డు నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం తాలూకు ఆందోళనలు హైకోర్టుకు చేరాయి.
హైకోర్టుకు చేరిన ఇంటర్ బోర్డు వ్యవహారం .. బాలల హక్కుల కమీషన్ పిటీషన్ పై విచారణ
ఇంటర్ ఫలితాల అవకతవకలకు కారణం కేటీఆర్ అత్యుత్సాహమే
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఇంటర్బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్నా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పెద్దగ స్పందించిన దాఖలాలు లేవు.. ఇంటర్ బోర్డులో అవకతవకలు తెలంగాణ సర్కారుని ఇబ్బంది పెడుతున్నాయి . అయితే ఈ ఉదంతానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యుత్సాహమే అని తెలుస్తోంది.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ను కాదని గ్లోబరీనా కు బాధ్యతలు ఇవ్వటంలో కేటీఆర్ ప్రమేయం
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను గత కొన్నేళ్లుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పర్యవేక్షిస్తోంది. అయతే ఆ సంస్థను కాదని కేటీఆర్ గ్లోబరీనా సంస్థకు ఆ బాధ్యతల్ని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థపై గతంలోనూ పలు వివాదాలున్నాయి. గతంలో ఓ వివాదం మూలంగా ఈ సంస్థపై సాక్ష్యాత్తు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహం విచారణకు ఆదేశించారు.
గతంలో జేఎన్టీయూ వివాదంలో ఉన్న గ్లోబరీనా సంస్థ
2017లో కాకినాడ జేఎన్టీయూలో గ్లోబరినా మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్ ఈ కంటెంట్ టెండర్లలో మోసాలకు పాల్పడినట్లు గ్లోబరీనాపై ఆరోపణలు వచ్చాయి. కాకినాడ జేఎన్టీయూలో 36 కోట్ల ఒప్పందం ద్వారా టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా 26 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్లోబరీనా మోసాలపై కాకినాడ సర్పవరం పీఎస్ ల లో జె.ఎన్.టి.యు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. గ్లోబరీనా మోసాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించటం బాధ్యతారాహిత్యం అని తల్లిదండ్రుల ఫైర్
ఇదింకా విచారణ దశలోనే వుంది. అలాంటి సంస్థకు ఇంటర్ పరీక్షల మూల్యాంకన బాధ్యతల్ని బాధ్యతారాహిత్యంగా అప్పగించి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్, విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై మంగళవారం గ్లోబరీనా సంస్థ సీఈఓరాజు స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంటర్ ఫలితాల అవకతవకల బాధ్యత కేటీఆర్ దే
తమపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, మాగ్నటిక్ సంస్థ తో పోటీపడి మరీ ఈ ప్రాజెక్ట్ను అత్యంత తక్కువ బిడ్డింగ్తో దక్కించుకున్నామని, ఇంటర్ ఫలితాల ప్రాజెక్ట్ మాకు దక్కడం వెనుక ఏ రాజకీయ నేత ప్రోద్భలం లేదని స్పష్టం చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. మరి ఈ ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.