9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబిత
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు గతేడాది ఫీజులే వసూల్ చేయాలని స్పష్టంచేశారు. నెలవారీగా మాత్రమే ఫీజు వసూల్ చేయాలని.. క్వార్టర్లీ పేరుతో ఫీజు కలెక్ట్ చేయొద్దని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: ముంబైలో 10వేల మార్క్ దాటిన కేసులు, పుట్టిన పాపకు కూడా..
రాష్ట్రంలో 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాశారని మంత్రి వివరించారు. వారి పేపర్లు 53 లక్షల 991 ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం నుంచి కోడింగ్ చేస్తున్నామని.. 11వ తేదీ వరకు ప్రక్రియ ముగుస్తోందని తెలిపారు. 12వ తేదీ నుంచి ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ చేస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు వాల్యూయేషన్ ప్రక్రియ ముగుస్తోందని.. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇదివరకు 12 స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లు నిర్వహించాలని అనుకున్నామని.. కానీ భౌతికదూరం పాటించాల్సి ఉన్నందున సెంటర్లను పెంచుతున్నామని వివరించారు. 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్ పకడ్బందీగా జరుగనుందని పేర్కొన్నారు. తొలుత ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ల వాల్యూయేషన్ జరుగుతోందని మంత్రి సబిత చెప్పారు. దీంతోపాటు మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్ష నిర్వహించలేదని.. దానిని ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు.