స్నానానికి వెళ్లి ఇంటర్ విద్యార్థుల జలసమాధి
కరీంనగర్: స్నానం చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు జలసమాధి అయిన సంఘటన తెలంగాణలోని కరీంనగర్ లో జరిగింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు మానేరు జలాశయం దగ్గరకు చేరుకుని విలపిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు కరీంనగర్ లోని జ్యోతినగర్ కు చెందిన సాదుల సునంద్ (16), బీరెల్లి వరుణ్ (16) ఇంటర్ చదువుతున్నారు. బుధవారం ఉదయం వీరిద్దరు మరో ఐదు మంది స్నేహితులతో కలిసి పోలీసు శిక్షణా కేంద్రంలో హై జంప్, లాంగ్ జంప్ చేశారు.
తరువాత మానేరూ జలాశయంలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. మొదట ఐదు మంది విద్యార్థులు జలాశయంలోకి దిగారు. అనంతరం వరుణ్, సునంద్ జలాశయంలోకి వెళ్లారు. ఐదు మంది ఒక వైపు వెళ్లారు.
అయితే వరుణ్, సునంద్ మరో వైపు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో వరుణ్, సునంద్ ఇద్దరూ గల్లంతు అయ్యారు. సాటి స్నేహితులు వారిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్థానికుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.