శ్రీచైతన్య బస్సు ఢీకొని విద్యార్థిని మృతి: విద్యార్థుల విధ్వంసం, ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీచైతన్య ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి చెందారు. ఈ ఘటన కూకట్పల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
రోడ్డు దాటుతుండగా..
జగద్గిరిగుట్టలో నివసించే రమ్య కూకట్పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన రమ్య.. కూకట్పల్లి బస్టాప్లో దిగి రోడ్డు దాటుతుండగా అదే కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొంది.
అక్కడికక్కడే రమ్య మృతి.. విద్యార్థుల విధ్వంసం
ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రమ్య మృతికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ సహ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. బస్సు అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే..
ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘ జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా విద్యార్థినిని బస్సు ఢీకొంది. కోపంతో ఉన్న విద్యార్థులు బస్సులపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. యాజమాన్యంతో కూడా మాట్లాడతాం. ఈ ప్రాంతంలో వేల మంది విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రులు, టీచర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది' అని తెలిపారు.
కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు
కాగా, శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రమ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.