దారుణం: స్మార్ట్ఫోన్ కోసం స్నేహితుడ్ని కాల్చి చంపేసిన ఇంటర్ విద్యార్థి
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడ్రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ్ అనే విద్యార్థి ఆదిభట్లలో శవమై కన్పించాడు. సెల్ఫోన్ కోసం అతని స్నేహితుడే ప్రేమ్ను కిరోసిన్ పోసి తగులబెట్టాడని పోలీసులు తెలిపారు.
ప్రేమ్కుమార్ వద్ద ఉన్న ఖరీదైన స్మార్ట్ఫోన్ను దక్కించుకోవాలని సాగర్ అనే మరో యువకుడు కుట్రపన్ని హత్యకు పాల్పడ్డాడు. జులై 13న బయటకు వెళ్దామంటూ ప్రేమ్ను బయటకు తీసుకెళ్లాడు.
అయితే, రాత్రి అయినా తమ కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో సాగర్.. ప్రేమ్ను బయటకు తీసుకెళ్లాడని తేలడంతో తమదైన శైలిలో అతడిని విచారించారు. పోలీసుల విచారణలో ప్రేమ్ను తానే హత్య చేసినట్టు సాగర్ ఒప్పుకున్నాడు.
ఆదిభట్ల వద్ద హత్యచేసి ఘట్కేసర్ వద్ద పెట్రోల్ తీసుకొని యువకుడిని కాల్చి చంపినట్టు తెలిపాడు. నిందితుడుని అదుపులోకి తీసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ్ మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ మృతి అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.