హెచ్చార్సీకి విద్యార్థుల ఫిర్యాదు..! కేసీఆర్ కు ఉత్తమ్ లేఖ.! పత్తా లేని కార్యదర్శి..!!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల చిచ్చు తారా స్థాయికి చేరుతోంది. ఇంటర్ ఫలితాల ప్రకటనలో గందరగోళం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 9.45 లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని, ఫలితంగా 3 రోజుల్లో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్కు ఉత్తమ్ బహిరంగ లేఖ..! నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నపీసిసి చీఫ్..!!
ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో సబ్జెక్టుల మార్కులకు, మొత్తం మార్కులకు తేడాలున్నాయని వివరించారు. ప్రతిరోజు 40 పేపర్లు దిద్దాల్సిన లెక్చరర్లు 65 పేపర్లు దిద్దారని ఉత్తమ్ లేఖలో ఆరోపించారు. మంచి మార్కులు వచ్చే విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని సూచించారు. కేసీఆర్కు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ధ్యాస తప్ప.. ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం న్యాయం చేయదంటున్న స్టూడెంట్స్..! హెచ్చార్సీ బాట పట్టిన విద్యార్థులు..!!
ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై అదికారులెవ్వరూ సరిగా స్పందింకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం చోటుచేసేకుంది. నేడు ఉదయం నుండి తమకు న్యాయం చేయాలని ఇంటర్ బోర్డ్ ముందు ఆందోళన చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. పైగా పోలీసులను మొహరింపజేసి ఆందోళన చేస్తున్న తల్లి దండ్రులను, విద్యార్థులను అరెస్టు చేసే ప్రయత్నం చేసారు పోలీసులు. దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేదని భావించిన విద్యార్థుల తల్లి దండ్రులు హ్యూమన్ రైట్స్ కమీషన్ ను సంప్రదించేందకు రంగం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది.
పత్తాలేని కార్యదర్శి..! సమాధానం ఇచ్చే నాథుడులేక ఇబ్బందులు..!!
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఫలితాల్లో ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందన్నారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో ఇచ్చామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సిబ్బంది తప్పుచేసినట్టు తేలితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రూ.2వేలు జరిమానా విధించనున్నట్టు చెప్పారు. తప్పుచేసిన ఉద్యోగి జరిమానా మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత బోర్డ్ కార్యదర్శి ఎక్కడ ఉన్నాడో, ఎందుకు స్పందించడంలేదో నని తల్లిందడ్నలు ఆరోపిస్తున్నారు.
ఎన్నో లోపాలు..! మొదట సున్న మార్కులు..తర్వాత 98 మార్కులు..! ఎలా సాద్యం..!!
ప్రథమ స్థానంలో నిలవడమే నిరంతర లక్ష్యంగా చదివే ఓ విద్యార్థిని తెలుగులో ఫెయిల్ అయినట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాల్లో ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగులో 98 మార్కులు సాధించిన ఆమెకు.. ద్వితీయ సంవత్సరం తెలుగులో ‘సున్నా' రావడంతో విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జి.నవ్య జన్నారంలోని కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. జరిగిన పొరపాటును సరిచేస్తూ నవ్యకు తెలుగులో 99 మార్కులు ఇచ్చారు. జాబితాను సరిచేసి ఆన్ లైన్ లో పెట్టారు.